
- ఎయిడెడ్ టీచర్లకూ ఇవ్వాలని విద్యాశాఖ యోచన
- సర్కార్ కు ప్రతిపాదనలు పంపిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. వీరితో పాటు ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ అవార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీనిపై త్వరలోనే నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. అలాగే, ఈ వారంలోనే అవార్డుల నోటిఫికేషన్ రిలీజ్ కానున్నది.
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తూ.. ఉత్తమ టీచర్లకు అవార్డులను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏటా ప్రభుత్వ, లోకల్ బాడీ, సొసైటీ గురుకులాలు, బీఈడీ, డీఈడీ కాలేజీల్లో పనిచేసే టీచర్లు, హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్లకు అవార్డులు ఇస్తున్నారు. అయితే, ఇక నుంచి సర్కారు పరిధిలోనే పనిచేస్తున్న మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో పనిచేసే టీచర్లకూ ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు యోచిస్తున్నారు.
కేజీబీవీల్లో పనిచేసే వారంతా కాంట్రాక్టు ఉద్యోగులే అయినా.. వారికీ ఇవ్వాలని భావిస్తున్నారు. మరోపక్క ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేసే వారినీ ఈ జాబితాలో చేర్చాలని డిసైడ్ అయ్యారు. దీనికి అనుగుణంగా టీచర్ అవార్డుల జీవోలో మార్పులు చేయాలని కోరుతూ ఇటీవలే విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణాకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రతిపాదనలు పంపించారు. ఈ అవార్డులకు అప్లై చేసుకునే వాళ్లకు కనీసం పదేండ్ల సర్వీస్ ఉండాలనే నిబంధన కొనసాగించనున్నారు.
ప్రైవేటు టీచర్లకూ ఇచ్చే యోచన..
కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను సర్కారు విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లకూ అందిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ దీన్ని అమలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు యోచిస్తున్నారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైనా వారంలోనే క్లారిటీ రానున్నది.