
- ప్రతి బడిలో కనీసం 3 గంటల పాటు ఉండాలి
- డైరెక్టర్ వారానికి కనీసం ఒకరోజు రెండు స్కూళ్లు చూడాలి
- డీఈవోలు, ఆర్జేడీలు మూడ్రోజులు బడులు తిరగాలి
- ఎఫ్ఎల్ఎన్, లిప్ పర్యవేక్షణకు విద్యాశాఖ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లు ఎలా నడుస్తున్నాయి? టీచర్లు పాఠాలు ఎలా చెప్తున్నారు? అనే వివరాలను తెలుసుకోవాలని విద్యాశాఖ డిసైడ్ అయింది. స్కూళ్లను స్కూల్ ఎడ్యుకేషన్ లోని ప్రతి అధికారి తనిఖీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ప్రధానంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్), లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (లిప్) కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ తనిఖీలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
2025–26 అకాడమిక్ ఇయర్లో డైరెక్టర్ నుంచి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ వరకు స్కూళ్లను ఇన్స్పెక్షన్ చేసేలా ప్లాన్ ప్రకటించారు. తనిఖీలు తూతూ మంత్రంగా కాకుండా కనీసం ఒక్కో స్కూల్లో 3 గంటలపాటు నిర్వహించాలని సూచించారు. దాంట్లో ఒక టీచర్ క్లాసు చెబుతుండగా మొత్తం విని, ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి. స్టాఫ్ మీటింగ్ పెట్టి, అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ నింపి.. దాన్ని ఫొటో తీసి యాప్ లో అప్ లోడ్ చేయాలి.
దీంతోపాటు విజిట్ చేసిన డేటాను కూడా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో పొందుపరచాలి. ప్రతినెలా 28న ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లతో డీఈవోలు జిల్లాస్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. స్కూళ్ల సందర్శనలో గమనించిన అంశాలపై సమీక్షించాలి. 29న డీఈవోలు,ఆర్జేడీలు, క్వాలిటీ కో ఆర్డినేటర్లు, రాష్ట్రస్థాయి అధికారులతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రివ్యూ నిర్వహించాలి.
బడుల సందర్శనలు ఇలా..
- డైరెక్టర్, హెచ్ వోడీలు, అడిషనల్ డైరెక్టర్లు, జేడీలు, డీడీతోపాటు ఇతర రాష్ట్రస్థాయి అధికారులు వారానికి కనీసం ఒకరోజు రెండు స్కూళ్లు, నెలలో 8 నుంచి 10 స్కూళ్లు విజిట్ చేయాలి.
- ఆర్జేడీలు, డీఈవోలు వారానికి 2 రోజులు కనీసం 3 లేదా 4 స్కూళ్లు, నెలలో 12 –16 వరకు స్కూళ్లు సందర్శించాలి.
- ఎంఈవోలు, సమగ్రశిక్ష జిల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్లు.. వారానికి 3 రోజుల్లో ఐదారు స్కూళ్లు, నెలలో 20 – 24 స్కూళ్లు అబ్జర్వేషన్ చేయాలి.
- కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు వారానికి 2 రోజులు రోజులు 4 –-5 స్కూళ్లు, నెలలో నెలకు 16– -20 స్కూళ్లను తనిఖీ చేయాలి.