
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు గాను సర్కార్ బడుల్లో తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, టీచర్ల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని సీఎం చెప్పారని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావ్ తెలిపారు. శనివారం సచివాలయంలో పీఆర్టీయూ నూతన సంవత్సర డైరీని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిసెంబర్ నెల వేతనాలను 5వ తేదీలోగా చెల్లించినందుకు ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, సంఘం నేతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ పదోన్నతులతో పాటు అన్ని సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, పంచాయతీరాజ్ ఉపాధ్యాయ మాస పత్రిక ప్రధాన సంపాదకులు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి పాల్గొన్నారు.