కుషాయిగూడ/మల్కాజ్ గిరి, వెలుగు: గుర్తు తెలియని ఇద్దరు మహిళలు ఓ వృద్ధురాలికి మద్యం తాగించి, ఆమె బంగారు ఆభరణాలు, ఫోన్ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సాయినగర్కు చెందిన కూరగాయల వ్యాపారి దోమట్టి అనసూయ(68)తో కుషాయిగూడ మార్కెట్లో ఓ మహిళతో రెండు నెలల క్రితం పరిచయం ఏర్పడింది.
అప్పుడప్పుడు ఆమె అనసూయ ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ నెల 3న ఉదయం ఆమె మరో మహిళతో కలిసి చికెన్, మద్యం తీసుకొని అనసూయ ఇంటికి వెళ్లింది. ఆకలిగా ఉందని అన్నం వండాలని కోరింది. తర్వాత మధ్యాహ్నం ఇద్దరూ కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. అనసూయ స్పృహ కోల్పోయాక బీరువాలోని పుస్తెలతాడు, చేతి వంకి, గోల్డ్చైన్తోపాటు ఫోన్ను చోరీ చేశారు. సుమారు 2 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలు ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
