- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అరుదైన కింగ్ కోబ్రాలు..
- అలుగులు, పొన్నం పిట్టలకు ఆవాసం
- సర్వేకు సర్వం సిద్ధం చేసిన ఫారెస్ట్ అధికారులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అడవుల జిల్లాగా పేరొందిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వన్యప్రాణుల లెక్క తేల్చేందుకు సైంటిఫిక్ సర్వేకు అటవీశాఖ సిద్ధమైంది. సర్వే చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలను రెడీ చేసింది. అరుదైన కింగ్కోబ్రాలు, అలుగులు, పొన్నం పిట్టలకు భద్రాద్రి జిల్లా ఆవాసంగా మారింది.
మరోవైపు కిన్నెరసాని ప్రాజెక్టులో దాదాపు 200కు పైగా మొసళ్లున్నట్టు గుర్తించారు. వీటితోపాటు కిన్నెరసాని అభయారణ్యంలో అరుదైన వన్య ప్రాణులున్నట్టుగా సీనియర్ ఫారెస్ట్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఈక్రమంలో సెంటిఫిక్ సర్వేతో జీవ వైవిధ్యంతో పాటు వన్య ప్రాణుల లెక్క తేల్చనున్నారు. నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుంది.
వన్యప్రాణుల లెక్క తీసేందుకు..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని అభయారణ్యం 64,435హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈక్రమంలో వన్యప్రాణుల లెక్క తేల్చేందుకు ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ఆఫ్రీసెర్చ్కాలేజ్స్టూడెంట్స్ నెలపాటు సైంటిఫిక్ సర్వేతోపాటు రీసెర్చ్ చేయనున్నారు. 10 మంది యువతీయువకులు బృందంగా ఈ సర్వేలో పాల్గొంటున్నారు. అడవిలో జీవ వైవిధ్యంపై రీసెర్చ్చేపట్టనున్నారు.
అరుదైన అలుగులు(పాంగోలియన్) భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. అలుగులు అంతరిస్తున్న జాతుల్లో మొదటి వరుసలో ఉన్నాయి. వీటి పరిరక్షణకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడనుంది. జిల్లాతో పాటు ములుగు, జయశంకర్భూపాలపల్లి, నాగర్కర్నూల్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ అలుగులకు ఇండోనేషియా, చైనా, మంగోలియా వంటి దేశాల్లో డిమాండ్ ఉండడంతో స్మగర్లు వీటిపై దృష్టి పెట్టారు. ఆ దేశాల్లో మెడిసిన్ తయారీలో వీటిని వినియోగిస్తారు. అలుగుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సర్వేలో గుర్తించి చర్యలు తీసుకోనున్నారు.
జిల్లాలో అరుదైన పొన్నం పిట్టలు చాలానే ఉన్నాయి. ఇవే కాకుండా అడవి దున్నలు, జింకలు, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, కనుజు, దుప్పులు వందల సంఖ్యలో ఉన్నాయి. పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టులో దాదాపు 200కు పైగా మొసళ్లు ఉన్నాయి. ఈ మధ్య జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు చిరుతను చంపిన ఆనవాళ్లు బయటపడ్డాయి.
కొన్ని చోట్ల కొండగొర్రెలు, దుప్పులు వేటగాళ్ల బారిన పడ్తుండంతో పాటు మరో వైపు రోడ్డు ప్రమాదాలు, కుక్కల దాడుల్లో మృతి చెందుతున్నాయి. సర్వే అనంతరం వన్య ప్రాణుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను రీసెర్చ్ స్టూడెంట్స్తోపాటు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వనున్నారు.
పులుల ఆవాసంగా మార్చేందుకు చర్యలు
జిల్లాలో ఇటీవల కాలంలో పులుల రాకపోకలు పెరిగాయి. పులుల ఆవాసాలుగా కిన్నెరసాని అభయారణ్యాన్ని మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని భద్రాద్రికొత్తగూడెం డీఎఫ్వో సిద్దార్థ్ విక్రం సింగ్, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ ఎఫ్డీవో బాబు పేర్కొన్నారు. సైంటిఫిక్ సర్వే అనంతరం ఆయా వన్యప్రాణుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో చర్చిస్తామన్నారు. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
