ఆప్, బీజేపీ మధ్య లొల్లి...ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా

 ఆప్, బీజేపీ మధ్య లొల్లి...ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మేయర్ ఎన్నిక కోసం సభ్యులంతా సమావేశమవగా..నామినేటెడ్ సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుతివ్వడంపై దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వాతావరణంలో మేయర్ ఎన్నికలు నిర్వహించలేమని ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ వాయిదా పడింది. 

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1957 ప్రకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో ఓటు వేయడానికి ఆల్డర్‌మన్ అర్హులని  ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ  తెలిపారు. ఈ చట్టం ప్రకారం 25 ఏళ్లు పైబడిన 10 మందిని  లెఫ్ట్ నెంట్ గవర్నర్  కార్పొరేషన్‌కు నామినేట్ చేయవచ్చు, అయితే 10 మంది బీజేపీ సభ్యులను ఆల్డర్‌మెన్‌గా ఎన్నుకోవడంలో లెఫ్ట్ నెంట్ గవర్నర్  నిబంధనలను ఉల్లంఘించారని AAP ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆప్  సభ్యుల వాగ్వాదాలతో MCD సమావేశాలు గందరగోళంగా మారాయి. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. 

250 స్థానాలుగల ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి 104, కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆప్ మేయర్ పీఠం సొంతం చేసుకుంటుందని భావించారు. అయితే MCD ఫలితాలు వెల్లడై రెండు నెలలైనా మేయర్ ఎన్నిక పూర్తి కాలేదు. జనవరి 6, జనవరి 24 తేదీల్లో జరిగిన సమావేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య తలెత్తిన వివాదాలతో  మేయర్ ఎన్నిక ఫిబ్రవరి6కు వాయిదా  పడింది.