సీఈఐజీలో కీలక పోస్టులన్నీ ఖాళీయే..2 నెలలుగా తనిఖీ విభాగం సేవలు బంద్

సీఈఐజీలో కీలక పోస్టులన్నీ ఖాళీయే..2 నెలలుగా తనిఖీ విభాగం సేవలు బంద్
  • 4 కీలక పోస్టులు, మరో 20 ఏఈ పోస్టులు పెండింగ్​
  • డిపార్ట్​మెంట్ హెడ్స్ కూడా లేరు
  • ప్రమాదాలు జరుగుతున్నా సిబ్బంది లేకపోవడంపై విమర్శలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్​ తనిఖీ విభాగం సేవలు 2 నెలలుగా నిలిచిపోయాయి. రాష్ట్ర ఇంధన శాఖ పరిధిలోని చీఫ్  ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టరేట్  ఆఫ్  గవర్నమెంట్ (సీఈఐజీ) విభాగంలో కీలక పోస్టులను ఇప్పటికీ నియమించలేదు. చీఫ్  ఎలక్ట్రికల్  ఇన్ స్పెక్టర్ (సీఈఐజీ), మూడు డిప్యూటీ సీఈఐజీలతో పాటు పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇండస్ట్రీలు, భారీ భవనాలకు అనుమతులు ఇచ్చే ఈ విభాగానికి ఇంధన శాఖ కనీసం ఇన్‌‌చార్జి అధికారిని కూడా నియమించకపోవడంతో విద్యుత్  భద్రతా తనిఖీలు పూర్తిగా స్తంభించాయి. రాష్ట్రంలో విద్యుత్  ప్రమాదాలు పెరుగుతున్నా, వాటిని నియంత్రించే యంత్రాంగం లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

13 ఏళ్లుగా నియామకాలు లేవు.. ప్రమోషన్లు లేవు..

విద్యుత్  తనిఖీ విభాగంలో గత 13 ఏళ్లుగా నియామకాలు జరగలేదు. పదోన్నతులు కూడా ఆగిపోయాయి. దీంతో సీఈఐజీ, హైదరాబాద్  డిప్యూటీ సీఈఐజీ, రూరల్  డిప్యూటీ సీఈఐజీ, నిజామాబాద్  ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్  వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు ఈ నాలుగు పోస్టుల బాధ్యతలను ఒకే అధికారి నిర్వహించారు. ఆ అధికారి పదవీ విరమణ చేయడంతో గత 50  రోజులకుపైగా డిపార్ట్​మెంట్​కు హెడ్  లేక సేవలు దాదాపు నిలిచిపోయాయి. 100 మందికి పైగా సిబ్బంది ఉండాల్సిన తనిఖీ విభాగంలో కనీసం 40 మంది సిబ్బంది కూడా లేరు. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకూ సీఈఐజీ పోస్టును క్రియేట్​ చేయలేదు.

దీనికి తోడు డిప్యూటీ సీఐజీ పోస్టులు కూడా భర్తీ చేయలేని దుస్థితి  కొనసాగుతోంది. ఏఈలు కూడా మరో 20కి పైగా ఉండాలి. ఏఈ పోస్టులకు రిక్రూట్​మెంట్​ నిర్వహించాల్సి ఉన్నా 2012 నుంచి నియామకాలే లేవు. ఏపీలో  నియామకాలు చేపట్టినా గత బీఆర్ఎస్  ప్రభుత్వం ఏమాత్రం దృష్టిపెట్టలేదు. దీంతో సీఈఐజీ నిస్థేజంగా మారింది.  రాష్ట్రవ్యాప్తంగా 16,140 విద్యుత్​11 కేవీ కనెక్షన్లు, 883 విద్యుత్​ 33 కేవీ కనెక్షన్లు, 107  132 కేవీ కనెక్షన్లు ఉండగా, తక్కువ సిబ్బంది ఉండడంతో  ఒక్కో అధికారి రోజుకు సగటున 50 కనెక్షన్లను తనిఖీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేయడంపై ఇంధన శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.