అహ్మదాబాద్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడవ డే అండ్ నైట్ టెస్టులో భారత స్పిన్నర్లు చెలరేగారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం మోతెరాలో జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్ ను విలవిల్లాడించింది భారత్. తొలి ఇన్నింగ్స్లో అక్షర్ పటేల్, అశ్విన్ ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 48.4 ఓవర్లలో కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది.
యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఆరు వికెట్లతో ఇంగ్లండ్ ప్లేయర్లను బెంబేలెత్తించేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ను ఆదిలోనే పేసర్ ఇశాంత్ శర్మ దెబ్బ తీశాడు. జట్టు స్కోరు 2 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్ సిబ్లీని డకౌట్ చేశాడు ఇశాంత్. ఆ తర్వాత స్పిన్నర్ల ధాటికి బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు.
ఇంగ్లండ్ జట్టులో క్రాలీ మాత్రమే 53 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో బెయిర్ స్టో (0), జో రూట్ (17), స్టోక్స్ (6), పోప్ (1), ఫోక్స్ (12), ఆర్చర్ (11), లీచ్ (3), బ్రాడ్ (3) పరుగులు చేశారు. అండర్సన్ పరుగులేమీ చేయకుండా నాటౌట్ గా నిలిచాడు.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 6, అశ్విన్ 3 వికెట్లు తీయగా ఇశాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు.