- కరోనాపై రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత తగ్గుతున్నందున కొవిడ్ రూల్స్కు మినహాయింపులు ఇవ్వాలని రాష్ట్రాలకు, యూటీలకు కేంద్రం సూచించింది. సోషల్ గ్యాదరింగ్స్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, అకడమిక్, రిలీజియస్, నైట్ కర్ఫ్యూలను సడలించాలని శుక్రవారం కోరింది. కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఇటీవల ఇచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా స్థానిక పరిస్థితులను బట్టి అమలు చేయాలని సెంట్రల్ హోం సెక్రటరీ అజయ్ భల్లా సూచించారు. ఆయా రాష్ట్రాలు, యూటీలలో వైరస్ తీవ్రతను పరిగణలోకి తీసుకొని ఫెస్టివల్ గ్యాదరింగ్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా హాల్స్, జిమ్స్, స్పాలు, రెస్టారెంట్లు, బార్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు తదితరాలు తెరవడంతో పాటు కమర్షియల్ యాక్టివిటీస్పై కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అయితే మాస్క్లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, హ్యాండ్స్ను వాష్ చేసుకోవడం, అన్ని చోట్ల వెంటిలేషన్ బాగా వచ్చేట్లు చూసుకోవడం లాంటివి కొనసాగించాలని రాష్ట్రాలు, యూటీల చీఫ్సెక్రటరీలకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. టెస్టులు, ట్రీట్మెంట్, ట్రేసింగ్, వ్యాక్సినేషన్ను కొనసాగించాలని సూచించారు.
కొత్తగా 13 వేల కేసులు
దేశంలో కొత్తగా 13,166 మంది కరోనా బారిన పడ్డారని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,28,94,345కు పెరిగాయని శుక్రవారం హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. యాక్టివ్ కేసులు కూడా 1,34,235కు తగ్గాయని, ఇది టోటల్ ఇన్ఫెక్షన్ రేటులో 0.31 శాతం అని పేర్కొంది. వైరస్తో 302 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 5,13,226కు పెరిగాయని చెప్పింది. రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగిందని వెల్లడించింది. డైలీ పాజిటివిటీ రేటు 1.28 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.48 శాతం, డెత్ రేటు 1.20 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు వైరస్ నుంచి 4.22 కోట్ల మందికిపైగా కోలుకున్నారని పేర్కొంది. వ్యాక్సినేషన్ డ్రైవ్లో 176.86 కోట్లకు పైగా డోసులు వేసినట్లు తెలిపింది.
ఢిల్లీలో సోమవారం నుంచి..
కేసులు తగ్గుముఖం పట్టడంతో కరోనా ఆంక్షలను ఎత్తేయాలని శుక్రవారం జరిగిన భేటీలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(డీడీఎంఏ) నిర్ణయించింది. పాజిటివిటీ రేటు 1% లోపే ఉండడంతో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూతో సహా ఆంక్షలు ఎత్తేయనున్నట్లు పేర్కొంది. మాస్కు లు పెట్టుకోవడం సహా ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.