వినాయక నిమజ్జనం వివరాలివ్వండి:  హైకోర్టు

వినాయక నిమజ్జనం వివరాలివ్వండి:  హైకోర్టు

హైదరాబాద్: వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని మరోసారి హైకోర్టు ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే రసాయనాలతోకూడిన విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా తీసుకుంటున్న చర్యలేమిటి? పూర్తి వివరాలతో సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. 
హుస్సేన్ సాగర్ లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలనిన్యాయవాది వేణుమాధవ్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఇళ్లల్లోనే మట్టిగణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలియజేయగా.. సూచనలు కాదు.. స్పష్టమైన ఆదేశాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదే కానీ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని హైకోర్టు హెచ్చరించింది. వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.