
- జిల్లాలో ఇప్పటికే పక్కదారి పట్టిన పింఛన్లు
- ప్రతినెలా విత్డ్రా కాని పింఛన్ లపై అనుమానాలు
- రిటైర్డ్ ఉద్యోగులకు డబులు పింఛన్.. రూ.2.68 కోట్లు స్వాహా
నిజామాబాద్, వెలుగు : నిస్సహాయులకు చేయూతనందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ, గీత, చేనేత, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులకు పింఛన్లు అందజేస్తుంది. పింఛన్ల పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే బయోమెట్రిక్ను అమలు చేస్తున్నా ఫింగర్ప్రింట్ పడక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫింగర్ ప్రింట్ స్థానంలో ఫేసియల్ రికగ్నేషన్ యాప్ను అమల్లోకి తెచ్చేందుకు సెర్ఫ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల ముఖం పక్కాగా మ్యాచ్ అయితేనే పింఛన్ డబ్బు చేతికందేలా బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వృద్ధుల వేలి ముద్రలు పడక సెక్రటరీల సంతకాలతో పింఛన్లు పంపిణీ చేస్తుండగా జిల్లాలో పింఛన్ డబ్బులు పక్కదారి పడుతున్నట్లు పలు ఉదాహరణలు ఉన్నాయి.
పోస్ట్ ఆఫీస్, బ్యాంకు ఖాతాల్లో సర్కార్ డిపాజిట్ చేస్తున్న పింఛన్ సొమ్ము నెలల తరబడి విత్డ్రా కాకపోవడంపై అధికారులు విచారణ చేస్తున్నారు. మృతుల పేర్లపై సొమ్ము జమ కావడం, మిస్సింగ్ వృద్ధుల పేరు మీద పింఛన్లు డ్రా కావడం ఇందుకు కారణమని అనుమానిస్తున్నారు. 2024--–25 విద్యా సంవత్సరంలో సర్కార్ స్కూల్ స్టూడెంట్స్కు అమలు చేసిన ఫెసియల్ అటెండెన్స్ సక్సెస్ అయ్యింది. మధ్యాహ్న భోజనం అక్రమాలకు కళ్లేం పడింది. దీంతోఈ ఫేసియల్ రికగ్నేషన్ విధానాన్ని పింఛన్ల పంపిణీకి వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో పింఛన్ల లబ్ధిదారులు ఇలా..
జిల్లాలో వివిధ రకాల పింఛన్ల కోసం 2,78,749 మందికిగాను ప్రతి నెలా రూ.58.16 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇందులో వృద్ధులు 73,088 మంది, వితంతులు 76,026, చేనేత కార్మికులు 192, గీత కార్మికులు 1,107, ఒంటరి మహిళలు 10,400, బీడీ కార్మికులు 96,094, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు 1,647, పైలేరియా పీడితులు 384, డయాలసిస్ పేషెంట్లు 193 ఉన్నారు. ప్రతి నెలా వీరికి రూ.2,016 పింఛన్ అందుతోంది.
వీరితోపాటు 19, 618 మంది దివ్యాంగులు ప్రతి నెలా రూ.4,016 పింఛన్ పొందుతున్నారు. లబ్ధిదారుల ఫింగర్ ప్రింట్ తీసుకొని పోస్ట్ ఆఫీస్లలో పింఛన్ డబ్బులు చెల్లిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ నమోదుకాని పక్షంలో విలేజ్ సెక్రటరీల సంతకాలను బేస్ చేసుకొని పింఛన్లు అందజేస్తున్నారు. పోస్టాఫీస్ అకౌంట్లేని లబ్ధిదారులకు వారిపేరుతో గల బ్యాంక్ ఖాతాలో పింఛన్ డబ్బులు డిపాజిట్ చేస్తోంది.
వెలుగు చూసిన పింఛన్ల గోల్మాల్.
పోస్టాఫీస్, బ్యాంక్ ఖాతాల్లో 7,359 మంది పేర్లపై డిపాజిట్చేసిన పింఛన్ డబ్బు 2022 ఆగస్టు నుంచి విత్డ్రా కావడంలేదనే సంగతి ఏప్రిల్ నెలలో బయటపడింది. మున్సిపాలిటీ ఏరియాలో 650 మంది పేర్లపై డిపాజిట్ చేసిన పింఛన్ డబ్బు ఏడాది నుంచి విత్డ్రా కావడంలేదనే విషయం తెలిసి గత నెల సెర్ఫ్ ఆఫీసర్లు బ్యాంకులకు వెళ్లి దర్యాప్తు చేశారు. 410 మంది ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు సెక్రటరీల సహకారంతో చేయూత పింఛన్లకూ అర్హత పొందారు. దీంతో ఇటు రిటైర్డ్ పింఛన్, అటు చేయూత పింఛన్ తీసుకున్నారు. దర్యాప్తులో గుర్తించిన అధికారులు ఇప్పటి వరకు రూ.2.68 కోట్లు మింగేసినట్లు నిర్ధారణ చేశారు. దీంతో ఆయా మండలాల ఎంపీడీవోలు సదరు రిటైర్డ్ ఉద్యోగులకు నోటీసులు సైతం జారీ చేయడంతో పింఛన్ల గోల్మాల్ బయటపడింది.
సర్కార్ ఆదేశాల ప్రకారం వెళ్తాం..
చేయూత పింఛన్లు ఇప్పటికైతే బయోమెట్రిక్ పద్ధతిలోనే పంపిణీ చేస్తున్నాం. కొత్త గైడ్లైన్స్ వస్తాయని వింటున్నాం. గవర్నమెంట్ ఎట్ల ఆదేశిస్తే ఆ ప్రకారమే నడుచుకుంటాం. పేదలకు మాత్రమే చెందిన స్కీమ్ ఇది. అనర్హుల ఏరివేతకు ఫేసియల్ రికగ్నేషన్ విధానం ఉపయోగపడనుంది.
సాయాగౌడ్, డీఆర్డీవో