
ఓల్డ్ సిటీలో ‘డబుల్’ దందా
శ్రీ రామలింగేశ్వర వీకర్ సెక్షన్ కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరుతో మోసం
రూ.20 వేల నుంచి రూ.40 వేలు వసూలు
ఫేక్ అలాట్ మెంట్ లెటర్స్, ఫ్లాట్ కీస్ ఇచ్చారు
ఫ్లాట్ల వద్దకు వెళ్లడంతో అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది
మోసపోయిన 500 మందికి పైగా బాధితులు
హైదరాబాద్: ఓల్డ్ సిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట బాధితులు భారీగా మోసపోయారు. ఈ దందా నాలుగేండ్లుగా కొనసాగుతుండగా బాధిత మహిళలు మంగళవారం స్థానిక టీఆర్ఎస్ నాయకుడిని కలిసి న్యాయం చేయాలని కోరడంతో అసలు విషయం తెలిసింది. వివరాల్లోకి వెళ్తే… రాజేంద్ర నగర్ కిషన్బాగ్లో ముస్లిం మహిళలకు అరబిక్ క్లాసెస్ నిర్వహిస్తుంటారు. టోలిచౌకికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ హఫీజ్ఖాన్ తన భార్యను పంపించాడు. అక్కడ ముస్లిం ఫ్యామిలీస్నే టార్గెట్ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని తన భార్యతో ప్రచారం చేయించాడు. తమను ఆశ్రయించిన వారికి డబుల్ బెడ్ రూమ్ స్కీమ్లో ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించారు.
ఫేక్ అలాట్మెంట్ లెటర్స్
జల్పల్లి గౌస్ నగర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూపించి వాటిలో అలాట్మెంట్ చేయిస్తామని నమ్మించారు. సుమారు 500 మందికి పైగా ముస్లిం మహిళల వద్ద రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేశారు. శ్రీ రామలింగేశ్వర వీకర్ సెక్షన్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో తెలుగులో ప్రింట్ చేసిన ఫామ్పై బాధిత మహిళల పేర్లతో అలాట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. కేటాయించిన బ్లాక్,ఫ్లాట్ నంబర్స్ కూడా రాశారు. ఎలాంటి అనుమానం రాకుండా ఆధార్కార్డ్, ఫొటోలతో అటెస్ట్ చేసిన పత్రాలు ఇచ్చారు.
ఫేక్ కీస్ కూడా ఇచ్చి…
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారని వాటికి సంబంధించిన రూమ్ కీస్ అంటూ డూప్లికేట్ కీస్ ఇచ్చారు. బాధితులకు ఇచ్చిన పత్రాలను ఇండ్ల అలాట్మెంట్ లెటర్స్గా నమ్మించారు. జల్పల్లి గౌస్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాట్మెంట్ అయ్యాయని వెళ్ళిన బాధితులను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఎవరికి ఇండ్ల కేటాయింపులు చేయలేదని చెప్పడంతో బాధితులు మోసపోయామని స్థానిక టీఆర్ఎస్ నాయకుడు రషీద్ షరీఫ్ను ఆశ్రయించడంతో మోసపోయామనే విషయం తెలిసింది.