- పలు ప్రముఖ పత్రికలు, టీవీ చానళ్లల్లో వచ్చినట్లు షేరింగ్లు
- ఫేక్ వీడియోలు, ఫొటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హల్ చల్
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిన ఫేక్ ప్రచారం.. పోలింగ్ రోజు కూడా కొనసాగింది. అధికార పక్షంపై ప్రతిక్షాలు.. ప్రతిక్షాలపై అధికార పక్షం వాళ్లు ఫేక్ న్యూస్తో విరుచుకుపడ్డారు. లేనిపోని రాతలు రాస్తూ, పేపర్తో పాటు వీడియో క్లిప్లను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పేరు, డేట్ లేని పేపర్ కటింగ్లను క్రియేట్ చేసి అబద్ధాలు ప్రచారం చేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ ఫేక్ ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రముఖ టీవీ చానళ్ల పేరు పెట్టి, ఫేక్ న్యూస్లను విపరీతంగా సర్య్కులేట్ చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తూ.. గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన వీడియోలను ఎడిట్ చేసి గురువారం ప్రచారం చేశారు. ఫేక్ వీడియోలు, గ్రాఫిక్స్ డిజైన్లతో ప్రముఖ చానళ్ల లోగోలు, పేర్లు పెట్టి జనాల్లోకి వదిలారు. అయితే, ఆయా టీవీ చానళ్లు ఉపయోగిస్తున్న రెగ్యులర్ ఫాంట్ కాకపోవడంతో అదంతా ఫేక్ ప్రచారమని ఈజీగా అర్థమవుతుంది. కాగా, పోలింగ్ ముందు రోజు రాత్రి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అండతో సునీల్ కనుగోలు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ టీమ్తో కలిసి అధికార పార్టీ అభ్యర్థులు, మంత్రి కేటీఆర్పై ఫేక్ ఆడియో, వీడియోలు రెడీ చేసి సర్క్యులేట్ చేస్తారని ప్రచారం జరిగింది. ఇలాంటివే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసిన కొన్ని ఫేక్ న్యూస్లు..కొడంగల్లో పోలింగ్ బూత్ దగ్గర ఓటర్లను బెదిరించారని, కాంగ్రెస్కు ఓటు వేయకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వమని వీ6 చానల్లో టెలికాస్ట్ అయినట్లు వీడియోను క్రియేట్ చేశారు. దానిని అధికార పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
ఖమ్మం జిల్లాలో టఫ్ ఫైట్ ఉన్న నేఫథ్యంలో “నియోజకవర్గంలో దూసుకపోతున్న కారు, అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే. నిరాశలో కాంగ్రెస్.. కొత్త ఓటర్లు బీఆర్ఎస్ వైపు’’అని ఓ ప్రముఖ చానల్లో టెలికాస్ట్ అయినట్లు చూపించారు.
- ‘‘తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాన్ఫిడెన్షియల్ సర్వే’’రిపోర్ట్ అంటూ ఫేక్ ప్రచారం. అందులో ఓ ప్రధాన పార్టీ నుంచి గెలుస్తున్న అభ్యర్థి పేరు తప్పుగా ఉండటం గమనార్హం.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టఫ్ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీదే హవా. డీలాపడ్డ ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు, అభిమానులు.. అని ఓ ప్రముఖ చానల్లో టెలికాస్ట్ అయినట్లు ప్రచారం చేశారు.
- “కేసీఆర్ మాకు మంచి మిత్రుడు, ఎన్నికల ఫలితాల తర్వాత అతనిని యూపీఏ చైర్మన్ చేస్తం”అని మరో చానల్లో న్యూస్ వచ్చినట్లు చూపించారు.
- ‘ప్రగతి భవన్ ఖాళీ చేస్తున్న సీఎం కేసీఆర్’అని మరో పేపర్ క్లిప్ను రెడీ చేసి ప్రచారం చేశారు.
- “అయితే వాళ్లు లేదా మేము పరిపాలించాలి. తెలంగాణను రెండు సామాజిక వర్గాలే పాలిం చాలి. బీసీలకు రాజ్యాధికారం ఇస్తే పాలించడం చేత కాదు”అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నట్లు మరో పేపర్ క్లిప్ను సర్క్యులేట్ చేశారు.
- “ఒడిపోయేలా ఉన్నాం.. మా పైసలు మాకు ఇచ్చేయండి. రేవంత్ రెడ్డికి టికెట్లు కొన్న అభ్యర్థుల నుంచి ఒత్తిడి”అని మరో పేపర్ క్లిప్లను పలు గ్రూపుల్లో షేర్ చేశారు.