నకిలీ ఫిజియోథెరపిస్టులు.. బీపీటీ చదవకుండానే క్లినిక్​ల ఏర్పాటు   

నకిలీ ఫిజియోథెరపిస్టులు..  బీపీటీ చదవకుండానే క్లినిక్​ల ఏర్పాటు   
  • నాలుగున్నరేండ్ల బీపీటీ చదవకుండానే క్లినిక్​ల ఏర్పాటు   
  • సర్టిఫికెట్, డిప్లొమా, డిస్టెన్స్​కోర్సులతో మరికొందరు 
  • ఆయుష్, ఆయుర్వేద, నేచురోపతి, ఆక్యుపంక్షర్​పేరిట ఫిజియోథెరపీ
  • అన్​క్వాలిఫైడ్ వ్యక్తులపై కలెక్టర్​కు కంప్లయింట్ 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో నకిలీ ఫిజియోథెరపిస్టుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బ్యాచిలర్​ఆఫ్​ ఫిజియోథెరపీ(బీపీటీ) విద్యార్హతలు లేకుండానే ఫిజియోథెరపిస్టులుగా చెలామణీ అవుతున్నారు. మరికొందరు ఆయుర్వేద, ఆక్యుపంక్చర్, ఆయుష్, పంచకర్మ క్లినిక్​ల పేరిట ఫిజియోథెరపీ చేస్తూ పేషెంట్లను మోసం చేస్తున్నారు. మంచిర్యాలలోని చాలా హాస్పిటళ్లలో ఇలాంటి వారు ఉన్నారు. మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేట తదితర ప్రాంతాల్లో అర్హత లేకుండానే ఫజియోథెరపిస్టులుగా కొనసాగుతున్నారు. మెడికల్​అండ్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​ పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. పలువురిపై ఫిర్యాదులు అందినప్పటికీ అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి.  

గల్లీకో ఫిజియోథెరపీ క్లినిక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు వివిధ పట్టణాల్లో గల్లీగల్లీకి ఫిజియోథెరపీ క్లినిక్​లు వెలుస్తున్నాయి. ఫిజియోథెరపీ క్లినిక్​ పెట్టాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగున్నర సంవత్సరాల బ్యాచిలర్​ ఆఫ్​ఫిజియోథెరపీ (బీపీటీ) పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు స్టేట్​పారా మెడికల్ ​బోర్డులో రిజిస్టర్​ చేసుకోవాలి. అలాగే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పర్మిషన్​తప్పనిసరి. ప్రస్తుతం జిల్లాలో డీఎంహెచ్​వో ద్వారా పర్మిషన్​ పొందిన క్లినిక్​లు 13 మాత్రమే ఉన్నాయి. అందులో మంచిర్యాలలో 10 ఉండగా, మిగతా మూడు మందమర్రి, బెల్లంపల్లిలో ఉన్నాయి. కాగా మరో 10 వరకు వైద్యారోగ్యశాఖ అనుమతి లేకుండా కొనసాగుతున్నట్లు సమాచారం.

పట్టించుకోని అధికారులు

అర్హత లేనివారు జిల్లాలో ఫిజియోథెరపీ క్లినిక్​లు ఏర్పాటు చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.  వివిధ సంస్థల ద్వారా సర్టిఫికెట్, డిప్లొమా, డిస్టెన్స్​కోర్సులు చేసినవారు, సీనియర్ల దగ్గర పనిచేస్తూ అనుభవం సంపాదించినవారు ఎలాంటి సర్టిఫికెట్లు, పర్మిషన్లు లేకుండానే ఫిజియోథెరపిస్టులుగా ప్రాక్టీస్​చేస్తున్నారు. మరికొందరు పేషెంట్లకు హోమ్​సర్వీస్​లు అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్ని హాస్పిటళ్లలో రిజిస్ట్రేషన్​ఒకరి పేరిట ఉంటే, వారి స్థానంలో అర్హత లేని వేరొకరు పనిచేస్తున్నారు. నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ల నొప్పులు, డిస్క్ పెయిన్, సయాటికా, స్పాండిలైటిస్​ వంటి తీవ్రమైన సమస్యలకు తెలిసీ తెలియని ట్రీట్​మెంట్ ​అందిస్తూ పేషెంట్లను మరింత ప్రమాదంలోకి నెడుతున్నారు.

కలెక్టర్​కు కంప్లయింట్

అన్​క్వాలిఫైడ్​ ఫిజియోథెరపిస్టులపై ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల కొంతమంది క్వాలిఫైడ్ ​ఫిజియోథెరపిస్టులు గ్రీవెన్స్​లో కలెక్టర్​కు కంప్లయింట్ ​చేశారు. మంచిర్యాల బస్టాండ్ ​రోడ్​లోని ఓ ప్రముఖ హాస్పిటల్​లో కృష్ణ అనే వ్యక్తి ఫిజియోథెరపిస్ట్​ కాకపోయినా అలా చెలామణీ అవుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంచిర్యాలలోని ఓ న్యూరో సెంటర్​లో వేదవతి, సోహెల్ ఫిజియోథెరపీ క్లినిక్ లో పర్వీన్, లక్సెట్టిపేటలోని స్టార్ ఫిజియోథెరపీ క్లినిక్​లో విజయ్, మందమర్రిలోని ఎస్ఆర్ఎం ఫిజియోథెరపీ క్లినిక్​లో రమాదేవి అర్హత లేకున్నా కొనసాగుతున్నారని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నేచురోపతి, ఆయుర్వేదిక్, ఆక్యుపంక్చర్, ఆయుష్ ​క్లినిక్​ల పేరిట కొన్ని సెంటర్లలో ఫిజియోథెరపీ ట్రీట్​మెంట్​ అందిస్తున్నారని తెలిపారు. అన్ క్వాలిఫైడ్​ ఫిజియోథెరపిస్టులపై ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను కోరారు. 

అధికారులు  యాక్షన్​ తీసుకోవాలి

మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో అన్ క్వాలిఫైడ్​ఫిజియోథెరపిస్టులు కొనసాగుతున్నారు. సర్టిఫికెట్, డిప్లొమా, డిస్టెన్స్​కోర్సుల పేరిట ఫేక్​సర్టిఫికెట్లతో క్లినిక్​లు నడిపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగున్నరేండ్లు బీపీటీ పూర్తి చేసిన వారినే ఫిజియోథెరపిస్టులుగా గుర్తించాలి. వైద్యారోగ్యశాఖ అధికారులు క్లినిక్​లను తనిఖీ చేసి అర్హత లేనివారిపై యాక్షన్​తీసుకోవాలి.  

   కె.వెంకటేశ్, రీచ్​ఫిజియోథెరపీ క్లినిక్, మంచిర్యాల