భక్తి కేవలం మనుషులకేనా జంతువులకు ఉండదా అంటే, అన్ని జీవరాసులు భక్తితో ప్రవర్తించాయని పురాణాలు చెప్తున్నాయి. ఉడుత, మొసలి, గద్ద, చిలుక... లాంటి జంతువులు, పక్షుల పాత్రలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. అలాగే, భక్తి అంటే మంత్రాలు చదవడం, ధ్యానం చేయడం. పొద్దున్నే లేచి పూజలు చేయడం అనుకుంటారు. ఎక్కువమంది. కానీ, భక్తి అనేది భేషజాలు, ఆర్భాటాల కోసం కాదు. నిర్మలమైన మనసుతో ఉండటమే భక్తి.
అలా అరనిమిషం అయినా దేవుడిపై మనసు పెట్టగలిగితే చాలు. అలా చేస్తే యజ్ఞయాగాలు చేసినంత ఫలం దక్కినట్లేనని ప్రవచనకారులు చెప్తున్నారు. అందుకోసం ఎవర్ని వాళ్లు సంస్కరించుకోవాలి. అదే దైవత్వంతో సమానం. పండగలు, ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా ప్రతిరోజూ మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే చాలు.
అప్పుడు జన్మనిచ్చిన అమ్మానాన్న, గురువు. సాయం చేసిన మిత్రులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్లు...ప్రతి ఒక్కరిలో దేవుడు కనిపిస్తాడు. ఈర్ష్యాద్వేషం లోపల నుంచి తొలగిపోతాయి. ఇదే భక్తుడి నుంచి భగవంతుడు కోరుకునేది అని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి.
