జయశంకర్ భూపాలపల్లి జిల్లా: పత్తిపంట నష్టపోయిందని కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన మెరుగు రాజ్ కుమార్ (31) అనే వ్యక్తి తమకి ఉన్న 2 ఎకరాలలో పసుపు పంట వేసి, కౌలుకు తీసుకుని 2 ఎకరాలలో పత్తి పంట సాగు చేశాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కొంత పత్తిపంట కొట్టుకుపోయింది. దీంతో మెరుగు రాజ్ కుమార్ భారీగా నష్టపోవడంతో అతడి తండ్రి మెరుగు భద్రయ్య జీర్ణించుకోలేకపోయాడు.
అప్పుతెచ్చి కౌలుకు తీసుకున్న పంట నష్టపోవడంతో.. మనస్థాపంతో మెరుగు భద్రయ్య(56) తన వ్యవసాయ పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన వ్యవసాయ భూమిలో ఉన్న వేప చెట్టుకు లుంగీతో ఉరి వేసుకొని చనిపోయాడు. గమనించిన గొర్ల కాపరులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చుసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.