
రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటూ సంబరాలు నిర్వహించేందుకు జనంలోకి వెళ్లిన ప్రజాప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది. ఆందోళనలు, నిరసనలు, నిలదీతలతో సభలను మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. అకాల వర్షం కారణంగా పంటలు నష్టపోయి తామంతా పుట్టెడు దు:ఖంలో ఉంటే సంబరాలెలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తాతల నుంచి వస్తున్న భూములను లీడర్లు కబ్జా చేశారని, అడిగితే పోలీసులతో కొట్టించారంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. తమ భూమి తమకు వచ్చే వరకు సంబరాలే వద్దంటూ పొయ్యిలను ఆర్పేశారు.
అన్నదాత ఆక్రోశం
‘మా తాతలు, తండ్రుల నుంచి దిగివస్తున్న భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బీఆర్ఎస్ లీడర్లు గుంజుకున్నరు. అట్లెందుకు అని అడిగితే తహసీల్దార్ తనను పోలీసులతో కొట్టిచ్చిండు..’అని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్ పిట్టలవాడకు చెందిన మహిళా రైతు సునీత కంటతడి పెట్టుకున్నారు.
‘రుణమాఫీ చేస్తమన్నరు.. నాలుగేండ్లయితుంది.. ఎప్పడు చేస్తరు..’అంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ముండ్రాజుపల్లిలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని ఓ రైతు ప్రశ్నించగా.. ‘నీకు రైతుబంధు వస్తుంది..కదా గొడవ చేయకు’అంటూ ఎమ్మెల్యే సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ‘రైతులు ఎవరూ సంతోషంగా లేరు.. రైతులకు రుణ మాఫీ చేయకుండా రైతు బంధు ఇస్తే ఏం లాభం’అంటూ నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
‘సీఎం కేసీఆర్ చెప్పినట్టు రైతులెవరూ సంతోషంగా లేరు.. వడగండ్ల వానతో పంటలు నష్టపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నరు..’ అని సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో రైతు మేడికుంట శ్రీనివాస్ అధికారులను నిలదీశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ ను బయటికి పంపించి వేశారు.
‘మాకు అన్యాయం చేసినందుకు సంబరాలా..? ధరణి తెచ్చి ఆగం చేస్తిరి కదా..? 284 సర్వే నంబర్ లోని భూసమస్య పరిష్కారం చేసే వరకు రైతు సంబరాలే వద్దు’ అంటూ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ లో రైతులు నిరసన తెలిపారు. భోజనాలు తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన పొయ్యిలను ఆర్పేసి, కూరగాయలను తీసి పారేశారు.