నాగార్జున సాగర్ కింద .. క్రాప్ హాలిడే! .

నాగార్జున సాగర్ కింద .. క్రాప్ హాలిడే! .
  • కృష్ణా బేసిన్‌‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
  • ఆగస్టు, సెప్టెంబర్‌‌‌‌లో వరద రాలే.. డెడ్ స్టోరేజీకి చేరిన సాగర్
  • నీటి విడుదలకు ఒప్పుకోని అధికారులు
  • ఆశలు వదిలేసుకున్న రైతులు

నల్గొండ, వెలుగు: ఈ సీజన్‌‌లో కృష్ణా నదికి వరదలు రాకపోవడం, నాగార్జున సాగర్ డెడ్​స్టోరేజీకి చేరడంతో ఆయకట్టు పరిధిలోని సుమారు 3.50 లక్షల ఎకరాల్లో రైతులు క్రాప్​హాలిడే ప్రకటించుకున్నారు. లెఫ్ట్ కెనాల్ కింద ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని సుమారు 10.37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ కృష్ణా బేసిన్‌‌లో వర్షాలు ముఖం చాటేయడం, ఎగువ నుంచి వరద లేకపోవడంతో నాగార్జున సాగర్ డెడ్​స్టోరేజీకి చేరింది. ఎనిమిదేండ్లుగా ప్రతి సీజన్​లో సాగర్ ఆయకట్టు పరిధిలో రెండు పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. గతేడాది జులై 28న లెఫ్ట్​కెనాల్​కు వాటర్ రిలీజ్ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వాయుగుండాల ప్రభావంతోనైనా సాగర్​లోకి నీరు చేరితే మొదటి జోన్​కైనా  సాగు నీరు విడుదల చేయవచ్చని ఆఫీసర్లు భావించారు. కానీ ఎగువ ప్రాంతాల నుంచి చుక్క నీరు ప్రాజెక్టులోకి చేరలేదు. దీంతో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 3.5 లక్షల ఎకరాలు పడావు పడ్డాయి.

ఆగస్టు మొదట్లోనే డేంజర్ బెల్స్

ఆగస్టు మొదటి వారం నుంచే సాగర్ ఆయకట్టులో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆగస్టు నాటికి 6.62 లక్షల ఎకరాల్లో   పంటలు వేయలేదు. అప్పటికే వరినార్లు పోసుకున్న రైతులు సాగర్​నుంచి నీటి విడుదల కోసం పడిగాపులు కాశారు. అయితే  కృష్ణా బేసిన్​లో వానలు కురవకపోవడం, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వరద లేకపోవడంతో సాగర్​లోకి ఆశించిన స్థాయిలో  నీరు చేరలేదు. ప్రాజెక్టులో నీటి నిల్వ 80 టీఎంసీలు కూడా లేకపోవడంతో వాటర్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఒప్పుకోలేదు. నీటిమట్టం ప్రస్తుతం 524 అడుగులకు చేరింది. 540 అడుగులకు చేరితేనే ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉంటుందని చెప్పడంతో రైతులు ఆశలు వదిలేసుకున్నారు. నిజానికి ఆగస్టులోనే తేరుకొని ప్రత్యామ్నాయ పంటలపై  రైతులను చైతన్యపరచాల్సిన ఆఫీసర్లు.. సెప్టెంబర్ వచ్చినా కళ్లు తెరవలేదు. గట్టి వానలు పడితే క్రాప్ హాలిడే ప్రకటించిన 3.50 లక్షల ఎకరాల్లో స్వల్పకాలిక ఆరుతడి పంటలు వేసుకోవాలని తీరా ఇప్పుడు సూచిస్తున్నారు. ఇందుకోసం సీడ్ కార్పొరేషన్​నుంచి కంది, మినుము, పెసర, జీలుగు తదితర విత్తనాలను సప్లై చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 2 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో లక్షన్నర ఎకరాల భూములు పడావు పడ్డాయి. ఇప్పుడు వానలు కురిసి, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు అంటున్నారు.

పశువులను మేపుతున్నం

నాకు చిల్లాపురం ఎన్ఎస్ పీ కెనాల్ కింద మూడెకరాల భూమి ఉంది. సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు రాక పొలం పడావు పెట్టిన. అక్కడ పశువులు మేపుతున్నం. బోరు ఉన్నా నీళ్లు రావడం లేదు. దీంతో ఆరుతడి పంటలు కూడా వేసుకోలేకపోతున్న.
- మాలోతు చిన్న,కోక్య తండా, మిర్యాలగూడ

మినుములు వేద్దామనుకుంటున్న

నాకున్న 5 ఎకరాల్లో మినుములు వేసేం దుకు దుక్కులు దున్నినం. సెప్టెంబర్ లో కూడా వర్షాలు లేకపోవడంతో వరికి కాలం ముగిసింది. మినుములు వేద్దామనుకుంటున్న.
- కంచర్ల వెంకన్న, తిరుమలగిరి, సాగర్​ మండలం, అల్వాల గ్రామం