బాపూ బాటలో నడిస్తే రైతులదే విజయం

బాపూ బాటలో నడిస్తే రైతులదే విజయం

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లులపై దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, హర్యానాల్లో రైతులు నిరసనలు చేస్తున్నారు. తాజాగా ఈ బిల్లులపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ స్పందించారు. శుక్రవారం గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేపథ్యంలో వారిని స్మరించుకున్న సోనియా.. మహాత్ముడు రైతుల పక్షపాతి అన్నారు. ఎల్‌‌బీ శాస్త్రి ఇచ్చిన జై జవాన్, జై కిసాన్ నినాదాలను ఆమె గుర్తు చేశారు. నిరసనల విషయంలో బాపూ చూపిన బాటలో నడిస్తే రైతులదే విజయమన్నారు.

‘మూడు నల్ల చట్టాలపై పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ప్రతి అసెంబ్లీలో రైతులు, కార్మికులకు మద్దతుగా మా పార్టీ కార్యకర్తలు, నేతలు ఆందోళనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఆందోళనలు విజయవంతమై రైతులు గెలుస్తారని నేను ఆశిస్తున్నా. మోడీ సర్కార్ వల్ల రైతుల కళ్లల్లో రక్తపు కన్నీళ్లు వస్తున్నాయి. అయినా సరే దేశం కోసం వారు ధాన్యాన్ని పండిస్తున్నారు’ అని సోనియా చెప్పారు.