
మథుర: ఉత్తర ప్రదేశ్లోని మథురలో ఘోరం జరిగింది. ఓ బిల్డింగ్ పేకమేడలా కూలిపోవడంతో తండ్రి, ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. మథురలోని కచ్చీ సడక్ ఏరియాలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. మృతులను తోతారాం (38), అతని కూతుళ్లు యశోద (6), కావ్య (3) గా గుర్తించారు. ప్రమాదం గురించి సమచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
బిల్డింగ్ శిథిలాల్లో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీశారు. గాయపడిన అతడిని దవాఖానాకు తరలించారు. ఈ ప్రమాదంతో సమీపంలోని పలు ఇండ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లవద్దని సూచించారు. కాగా.. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను సీఎం సీరియస్గా తీసుకున్నారు. మృతుల కుటుంబానికి పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్ మెంట్ ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.