కూతురుని కాపురానికి తీసుకెళ్లడం లేదని తండ్రి ఆత్మహత్య

కూతురుని కాపురానికి తీసుకెళ్లడం లేదని తండ్రి ఆత్మహత్య

తల్లాడ, వెలుగు: కూతురుని కాపురానికి తీసుకెళ్లకుండా అల్లుడు వేధిస్తున్నాడని తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన చల్లా వెంకట దుర్గారావు తన కూతురు తేజశ్రీ వివాహం కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన వీరాంజనేయులుతో 2019తో జరిపించారు. వీరాంజనేయులు విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్ చేస్తున్నాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. కొంతకాలంగా వీరాంజనేయులు భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. దీంతో తేజశ్రీ పుట్టింటి దగ్గరే ఉంటోంది. తన కూతుర్ని కాపురానికి తీసుకెళ్లమని పెద్దల సమక్షంలో పలుసార్లు నచ్చజెప్పినా వినలేదు. ఇటీవల ఫోన్ చేసి అదనపు కట్నం కావాలని, లేదంటే మీ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లనని బెదిరించాడు. మనస్తాపానికి గురైన వెంకట దుర్గారావు(46)  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.