
ఒకప్పుడు ప్రధాని మోడీ చేతుల మీదుగా సత్కారం పొందిన క్రీడాకారిణి, ఇప్పుడు రోడ్డు మీద బతుకీడుస్తుంది. సంవత్సరాలు గడిచినా తనకు ఎటువంటి సహాయం అందడం లేదని వాపోతుంది ఆ క్రీడాకారిణి.
ముంబైకి చెందిన ఫుట్బాల్ క్రీడాకారిణి మేరీ 2017లో సెంటర్స్ మిషన్ 11 మిలియన్ ప్రోగ్రాం కింద ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఢిల్లీలో సత్కరించబడింది. అప్పుడు మేరీ వయసు 16 సంవత్సరాలు. ఇప్పుడు మేరీ కుటుంబం సొంత ఇల్లు లేక రోడ్డు మీద నివసిస్తోంది. మేరీ కుటుంబానికి 2010 వరకు ఒక ఇల్లు ఉండేది. కానీ, బృహన్ ముంబై మహానగర్ పాలికా సంస్థ ఆమె ఇంటిని కొన్ని కారణాల వల్ల కూల్చివేసింది. అప్పటి నుంచి వారు రోడ్డు మీదనే నివసిస్తున్నారు. మేరీకి ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. వారంతా తన తండ్రి ఏర్పాటు చేసిన తాత్కలిక నివాసంలో రోడ్డుపైనే ఉంటున్నారు. మోడీ సత్కరించిన తర్వాత తమ కష్టాలు తీరుతాయని, తమ ఇల్లు తమకు వస్తుందని ఆశపడ్డారు. కానీ, ఇప్పటివరకు ఎటువంటి సాయం అందకపోవడంతో వారు నిరాశలో బతుకుతున్నారు.
‘మోడీ జీని కలిసిన తరువాత, అందరూ మాకు సహాయం చేస్తారని చెప్పారు. సంవత్సరాలు గడిచిపోయాయి, కాని ఎవరూ మాకు సహాయం చేయలేదు. మాకు ఇల్లు కావాలి. నేను నా చదువును కూడా మధ్యలోనే ఆపేశాను’ అని మేరీ తెలిపారు.
మేరీ తండ్రి ప్రకాష్ నాయుడు బీఎంసీలో తాత్కాలిక క్లీన్-అప్ మార్షల్గా పనిచేస్తుండగా, ఆమె తల్లి బబితా నాయుడు గృహిణి. మేరీ తండ్రి మాట్లాడుతూ.. మేరీ ఏదో ఒక రోజు ఫుట్బాల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటుందని ఆయన తెలిపారు. తమ కుటుంబానికి ఒక ఇల్లు కేటాయించాలని ఆయన కోరారు. తన ముగ్గురు పిల్లలకు మంచి చదువును అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
మేరీ చదువుకున్న స్కూల్, ఆమె ఆటతీరును మెచ్చి మేరీకి రూ. 25 వేల ఆర్థికసాయం చేసింది. మేరీ స్థానిక కార్పొరేటర్ మరియు ఎమ్మెల్యే నుండి ఆర్థిక సహాయం కూడా పొందింది. ఏదో ఒక రోజు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తానని మేరీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
For More News..