
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వేసవి సెలవుల అనంతరం అంగన్వాడీ కేంద్రాల పున: ప్రారంభ కార్యక్రమం పండగ వాతావరణంలో జరపాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ నెల10 నుంచి 17 వరకు నిర్వహించనున్న ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ కార్యక్రమంపై సీడీపీఓలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ గ్రామ పెద్దలు, స్వయం సహాయక గ్రూపు మహిళలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీడబ్ల్యూఓ జరీనా బేగం, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.