
నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. శాలిగౌరారం మండలం ఇటుకులపాడు గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రోడ్లు బాగులేవంటూ కామెంట్స్ చేశారు. ఇటుకులపాడుకు ప్రధాన రహదారి నుంచి గ్రామానికి 3 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టిందన్నారు. వెయ్యి కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం.. ఒక్క కోటి రూపాయలు ఇచ్చుంటే ఈ రోడ్డు బాగుపడేదని అన్నారు. ఇటుకల పాటులో పేదలకు ఇండ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వెంకటరెడ్డిపై ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పర్యటన మధ్యలోనే ముగించుకొని వెంకటరెడ్డి వెళ్లిపోయారు.