- ఆగస్టు నుంచే ‘మీ ప్రమాణం’ యాప్తో హాజరు నమోదు
- ఆలస్యంగా వచ్చి.. తొందరగా వెళ్లడం కుదరదు
- ఆలస్యమైతే.. వివరణ ఇవ్వాల్సిందే
- ఉద్యోగుల డుమ్మాకు చెక్
యాదాద్రి, వెలుగు: ప్రభుత్వాఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు ఎప్పుడొస్తారో..? ఎప్పుడెల్తారో ఎవరికీ తెలియదు. చాలా మంది ఉద్యోగులు హైదరాబాద్లో ఉంటూ ఇలా వచ్చి అలా వెళ్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఉద్యోగులు సమయపాలన పాటించేందుకు యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా ఉద్యోగులకు పేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదు చేసేందుకు నిర్ణయించారు. ఆగస్ట్ నుంచి ‘ మీ ప్రమాణం’ యాప్తో హాజరు నమోదుకు ఆదేశాలిచ్చారు.
ఇప్పటివరకు మ్యాన్యువల్ హాజరే
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో 50 డిపార్ట్మెంట్లలో హెచ్వోడీలు, రెగ్యూలర్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కలిపి దాదాపు 600 మంది పని చేస్తున్నారు. యాదాద్రి జిల్లా హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో వీరిలో 70 శాతం మంది ఎంప్లాయీస్.. పిల్లల చదువులు, ఇతర వ్యాపకాలతో ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, నాగోల్, ఎల్బీ నగర్ ఏరియాల్లో ఉంటూ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. వీరిలో చాలా మంది ఆఫీసుకు ఎప్పుడు వచ్చి వెళ్తారో తెలియని స్థితి. ఆఫీస్కు వచ్చినా.. రిజిస్టర్లో సంతకం పెట్టేసి రిలాక్స్ అవుతారు. కాసేపటికే లంచ్.. అది పూర్తయి.. సాయంత్రం నాలుగు కాగానే ఖాళీ టిఫిన్ బాక్స్లు సర్దుకొని వెళ్లిపోవడం కామన్ అయిపోయింది. కొందరు ఆఫీసుకు రాకుండానే ఫీల్డ్ వెరిఫికేషన్ పేరుతో డుమ్మా కొట్టేవారున్నారు.
ఫేస్ రికగ్నైజేషన్ హాజరుతో డుమ్మాలకు చెక్
టైమ్ మెయింటెయిన్ చేయని ఉద్యోగులు చెక్ పెట్టేందుకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్తో హాజరు తీసుకోవాలని కలెక్టర్అనురాగ్ జయంతి నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో కలెక్టరేట్ ఎంట్రన్స్లో రెండు వైపులా ఫేస్ క్యాప్చర్ చేసి స్కానింగ్ చేయడానికి కెమెరా ఏర్పాటు చేయాలని భావించారు. ఖర్చు ఎక్కువగా అవుతుందన్న ఉద్దేశంతో ‘మీ ప్రమాణం’ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు తీసుకోవడానికి చర్యలు ప్రారంభించారు. ఈ యాప్ను డిపార్ట్మెంట్స్హెచ్వోడీ సహా ఉద్యోగులు అందరూ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
హెచ్వోడీలకు మాత్రం వెబ్ లాగిన్ఇస్తారు. కలెక్టరేట్కు 30 మీటర్ల లోపు ఉంటేనే హాజరు తీసుకుంటుంది. దీంతో హెచ్వోడీ ఎక్కడ ఉన్నా.. ఎంప్లాయ్ వచ్చిన విషయం తెలిసిపోతుంది. తిరిగి వెళ్లే సమయంలోనూ యాప్ ద్వారా హాజరు వేయాల్సి ఉంటుంది. ఈ హాజరు రిపోర్ట్ను హెచ్వోడీలు కలెక్టర్కు అందజేస్తారు. ఈ విధానం వల్ల ఎంప్లాయ్ రాకున్నా.. మ్యాన్యువల్గా హాజరు వేసే అవకాశం ఉండదు. యాప్లో ఒకరి పేరుతో మరొకరు హాజరు వేయడం కుదరదు. ఇక ఆలస్యంగా వచ్చినా.. విధులకు హాజరు కాకున్నా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కలెక్టరేట్లో ఈ విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత మండలాల్లోని ఎంపీడీవో, తహసీల్దార్ సహా అన్ని డిపార్ట్మెంట్లలోనూ అమలు చేసే అవకాశం ఉంది.
