టీఎంయూలో పదవి కోసం పోరు

టీఎంయూలో పదవి కోసం పోరు

నాయకత్వ మార్పు పై నేతల పోరు
తమకే జనరల్ సెక్రటరీ పదవి కావాలంటున్న ఇరు వర్గాలు
ఇయ్యకుం టే రాజీనామా, కొత్త యూనియన్‌ పెట్టే యోచన?
తామే యూనియన్ నుంచి వేటు వేస్తా మంటున్న మరో వర్గం

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ)లో అంతర్గత పోరు ముదిరింది. నాయకత్వ మార్పుపై యూనియన్‌ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. జనరల్‌ సెక్రటరీ పదవిపై ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తమకే దక్కాలంటున్న ఒక వర్గం.. పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తామని, కొత్త యూనియన్​ పెడతామని హెచ్చరిస్తున్నారు. అయితే వార్నింగ్​లకు తలొగ్గమని, అలాంటి వారిని తామే బహిష్కరిస్తామని మరో వర్గం చెబుతోంది.

నాయకత్వ మార్పు తప్పదా!

గత డిసెంబర్‌లో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరిగింది. దీనికి యూనియన్లే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. అసలు ఆర్టీసీలో యూనియన్లే అవసరం లేదన్నారు. ఇందులో భాగంగా యూనియన్లకు ఇచ్చిన అన్ని ఫెసిలిటీస్‌ రద్దు చేశారు. అప్పటి నుంచి గుర్తింపు పొందిన యూనియన్‌ టీఎంయూ సైలెంట్​గా ఉండిపోయింది. ఇటీవల మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నాయకత్వ మార్పు చేయాలని భావిస్తోంది. ఇక్కడే టీఎంయూలో ముసలం మొదలైంది.

ఓ వర్గం రహస్య సమావేశం..

నాయకత్వ మార్పుపై ఇప్పటికే యూనియన్ కీలక నేతలు ఒకటి, రెండుసార్లు సమావేశమయ్యారు. యూనియన్‌లో జనరల్‌ సెక్రటరీ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న ఓ సీనియన్‌ నేత తనకే జనరల్‌ సెక్రటరీ పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఉద్యమ సమయం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నానని, ఇవ్వాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. మొదట ఇస్తామని అంగీకరించినా ఆ తర్వాత వివిధ పరిణామాలతో వెనక్కి యూనియన్​ నేతలు తగ్గినట్లు తెలిసింది. అయితే సదరు నేత మాత్రం వెనక్కి తగ్గడంలేదని సమాచారం. ఈ నేపథ్యంలో యూనియన్​ రెండు వర్గాలుగా చీలిపోయింది.

అవసరమైతే కొత్త యూనియన్?

ఇటీవల రహస్యంగా జరిగిన సమావేశంలో ఒక వర్గానికి అనుకూలంగా ఉన్న కొంత మంది వివిధ అంశాలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకే ప్రధాన కార్యదర్శి పదవి కావాలని అందరి మద్దతు కోరే ప్రయత్నం చేశారు. రహస్య సమావేశానికి హాజరైన నేతలకు అనేక ఆశలు చూపుతున్నారని ఆ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. జనరల్‌ సెక్రటరీ పదవి ఇవ్వకపోతే టీఎంయూకు రాజీనామా చేసి, కొత్తగా మరో యూనియన్‌ పెట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. వీరంతా పలువురు మంత్రుల సాయంతో కేసీఆర్‌, కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వ మద్దతుతోనే సాధ్యమని ఆ వర్గం భావిస్తోంది. ఏ విషయం తేలకపోతే ఈ నెల 10 వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

మేమే బహిష్కరిస్తం..

కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటిలో నాయకత్వ మార్పు ఉండదని మరో వర్గం చెప్తోంది. ఇన్‌చార్జ్​ జనరల్‌ సెక్రటరీ ఇస్తామని ఆఫర్‌ ఇచ్చినా సదరు నేత అంగీకరించలేదని, కావాలని రహస్య సమావేశాలు పెడుతున్నారని, కానీ ఆశించిన మేర నేతలు హాజరు కాలేదని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. ఇలానే యూనియన్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే బహిష్కరిస్తామని హెచ్చరించారు.

For More News..

రాష్ట్రంలో లక్ష టన్నుల యూరియా కొరత

హైదరాబాద్‌‌‌‌లో సాదాసీదాగా నిమజ్జనం

త్వరలో లొంగిపోనున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలు