తెలుగు రాష్ట్రాల్లో రూ.800 కోట్ల లోన్లు ఇస్తం

తెలుగు రాష్ట్రాల్లో రూ.800 కోట్ల లోన్లు ఇస్తం

హైదరాబాద్, వెలుగు: ఫిన్‌‌టెక్ కంపెనీ కినారా క్యాపిటల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లలోని   ఎంఎస్​ఎంఈలకు 2024 ఆర్థిక సంవత్సరంలో  తనఖా లేకుండా రూ.800 కోట్ల విలువైన బిజినెస్​ లోన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ సంస్థ 2016 నుంచి తెలుగు రాష్ట్రాల అర్బన్​,  సెమీ-అర్బన్ ప్రాంతాలలోని ఎంఎస్​ఎంఈలకు 20 వేలకు పైగా లోన్లను అందించింది. వీటి విలువ రూ.1,200 కోట్లు.  2022 నుంచి 2023 వరకు తమ ఏయూఎం (అసెట్స్​ అండర్​ మేనేజ్​మెంట్​) 190శాతం వరకు పెరిగిందని కంపెనీ ప్రకటించింది.  

ఈ ప్రాంతాల్లో 16 వేల మందికి ఉద్యోగాలను ఇచ్చామని తెలిపింది. ఆహార ఉత్పత్తులు, నిర్మాణ వస్తువులు, ఎలక్ట్రికల్స్, ఫ్యాబ్రికేషన్, చెక్క వస్తువులు, మెటల్ పార్టులు,  ఫ్యాషన్ కంపెనీలకు ఎక్కువగా లోన్లు ఇచ్చామని సంస్థ చీఫ్​ ఆపరేటింగ్​ ఆఫీసర్​ తిరునావుక్కరసు వెల్లడించారు.  ‘‘మేం ఎంఎస్​ఎంఈలకు  దీర్ఘ,  స్వల్పకాలిక వర్కింగ్ క్యాపిటల్, అసెట్ కొనుగోలు (మెషినరీ కొనుగోలు)  బిల్ డిస్కౌంటింగ్ లోన్లు ఇస్తాం. వీటి విలువ రూ. లక్ష నుంచి- రూ.30 లక్షల వరకు ఉంటుంది. వడ్డీరేట్లు 20 శాతం నుంచి 26 శాతం వరకు ఉంటాయి.

మహిళా ఎంట్రప్రిన్యూర్లకు వడ్డీపై 1-2శాతం వరకు డిస్కౌంట్​ ఉంటుంది.  తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌‌లో మాకు 27 శాఖలు ఉన్నాయి. మా ఎన్​పీఏలు 2 శాతం దాకా ఉన్నాయి.   ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోని వందకుపైగా ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాం. త్వరలో రాజస్థాన్​ లేదా మధ్యప్రదేశ్​లో బిజినెస్​ మొదలుపెడతాం. ఈ ఏడాది తెలంగాణలో కొత్తగా ఎనిమిది శాఖలను ఏర్పాటు చేస్తాం. ప్రతి ఏడాది ఒక్క రాష్ట్రంలో అడుగుపెడతాం. ఎంఎస్​ఎంఈల కోసం బిజినెస్​ క్రెడిట్​కార్డ్​ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాం”అని ఆయన వివరించారు.