రాహుల్ పై ఎఫ్ఐఆర్‌‌.. రాజకీయ కుట్ర..వివక్ష, అంటరానితనంపై పోరాటం నేరమా?: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రాహుల్ పై ఎఫ్ఐఆర్‌‌.. రాజకీయ కుట్ర..వివక్ష, అంటరానితనంపై పోరాటం నేరమా?: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: దళితులపై వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం బీజేపీ రాజకీయ కుట్రలో భాగమని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఎదుర్కొన్న అవమానాలపై రాహుల్ ప్రశ్నిస్తే.. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, రాహుల్ పై కేసు నమోదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వివక్షను, అంటరానితనాన్ని ప్రశ్నించడం నేరమా అని ఫైరయ్యారు.

బీజేపీ నిరంకుశ పాలనకు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెట్టినా దళితుల హక్కులు, వారి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ లక్ష్యాలకు అనుగుణంగానే తెలంగాణలో రేవంత్ ప్రజాపాలన సాగుతున్నదని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బీసీ కులగణన, రైతులకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, సన్నాలకు బోనస్, రైతు బీమా, గృహ జ్యోతి, మహిళలకు ఉచిత బస్సు, యంగ్ ఇండియా స్కూళ్లు ఇలా.. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు  ప్రభుత్వం అండగా ఉంటున్నదన్నారు.