- చత్తీస్ గఢ్లో ప్రారంభం.. జోరుగా ఏర్పాట్లు
- సేకరించిన సమాచారం గోప్యంగా
- ఆన్ లైన్లోనూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ సౌకర్యం
రాయ్పూర్: దేశవ్యాప్త 2027 జనగణన మొదటి దశ ఇప్పటికే ఏప్రిల్ 1న ప్రారంభమైన నేపథ్యంలో చత్తీస్గఢ్ లో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ భారీ కార్యక్రమానికి రాష్ట్రంలో ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్తో మొదటి దశ జనగణన నిర్వహించనున్నారు.
మొత్తం జనగణనలో ఇది కీలకం కానుంది. ఈ దశలో ప్రతి రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ వివరాలు, వాటి స్టేటస్, వాడుక, వాటిలో లభ్యమవుతున్న సౌకర్యాలను సేకరించనున్నారు. మే 1 నుంచి 30 వరకు హౌస్ లిస్టింగ్, ఎన్యుమరేషన్ వివరాలు సేకరిస్తారు. కాగా.. ‘డిజిటల్ ఇండియా’లో భాగంగా పౌరులు ఆన్ లైన్ లోనూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈనెల 16 నుంచి 30 వరకు ఫ్యామిలీస్ స్వచ్ఛందంగా తమ ఇంటి వివరాలను ఆన్లైన్లో సమర్పించవచ్చు.
సెల్ఫ్ ఎన్యుమరేషన్ కోరుకునే వారికి ప్రత్యేకంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ పంపుతారు. ఆ ఐడీని జాగ్రత్తగా ఉంచుకోవాలి. జనగణన వెరిఫికేషన్ కోసం సిబ్బంది వచ్చినపుడు వారికి ఆ ఐడీని ఇవ్వాలి. ఇక మొదటి దశలో నంబర్, స్టేటస్, ప్రతి బిల్డింగ్ లేదా ఇంటి టైప్, దాని యూసేజ్ (రెసిడెన్షియలా, కమర్షియలా), నిర్మాణ స్వభావం (కచ్చా భవనమా, పక్కా భవనమా), ఆ ఇంట్లో అందుబాటులో ఉన్న సౌకర్యాల (తాగునీరు, టాయిలెట్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్ నెట్ కనెక్టివిటీ వంటివి) వివరాలను రికార్డు చేస్తారు.
కాగా.. దేశంలోనే ఇది చరిత్రాత్మక జనగణన కానుంది. డిజిటల్ సెన్సస్ చేపట్టడం ఇదే మొదటిసారి. ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు నేరగా తమ మొబైల్ ఫోన్లలో డేటాను ఎంటర్ చేస్తారు. మొత్తం ప్రక్రియను సెన్సస్ మేనేజ్ మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తారు. సేకరించిన సమాచారాన్నంతా గోప్యంగా ఉంచుతారు.
