పద్మారావునగర్, వెలుగు: ఓ వైపు తల్లి ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతుంటే, మరో వైపు తండ్రి ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడంతో ఏకాకిగా మారిన ఆరేండ్ల బాలుడిని ఆస్పత్రి సిబ్బంది అతడి బంధువులకు అప్పజెప్పారు. మేనత్త, పెద్దమ్మకు సోమవారం బాలుడిని అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్కు చెందిన మాధవి(30)ని రెండో కాన్పు కోసం ఆమె భర్త గంగాధర్ ఈ నెల1న గాంధీ దవాఖానాకు తీసుకువచ్చి అడ్మిట్ చేశాడు.
ఆరేండ్ల కొడుకు సాత్విక్(6) కూడా వీటి వెంట వచ్చాడు. తర్వాతి రోజు డెలివరీ టైమ్లో శిశువు పుట్టి చనిపోగా, మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే భార్య, కొడుకుని వదిలేసి గంగాధర్ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. అదేరోజు అర్ధరాత్రి సాత్విక్ దవాఖానాలో ఒంటరిగా తిరుగుతుండగా సెక్యూరిటీ సిబ్బంది గమనించి గార్డురూమ్కు తీసుకొచ్చారు.
బాలుడు వివరాలు సరిగ్గా చెప్పకపోవడంతో అతడ్ని చేరదీసి, వారంరోజులుగా అతడి ఆలనాపాలన చూస్తున్నారు. పత్రికల్లో వార్తలు చూసిన నిజామాబాద్లోని బాలుడి మేనత్త, పెద్దమ్మ సోమవారం గాంధీకి రాగా.. పోలీసుల సమక్ష్యంలో సెక్యూరిటీ సిబ్బంది బాలుడిని వారికి అప్పగించారు. ఎంఐసీయూలో ట్రీట్మెంట్పొందుతున్న మాధవితో మాట్లాడి సాత్విక్ను తీసుకొని ఊరికి వెళ్లిపోయారు.
తీవ్ర అస్వస్థత నుంచి కోలుకుం టున్న మాధవి రెండ్రోజుల్లో డిశ్చార్జి కానున్నట్లు డాక్టర్లు తెలిపారు. గంగాధర్ ఫోన్ స్విచ్ఛాప్ వస్తోం దని, మిస్సింగ్ కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు.