హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ ఎండ్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఫౌండేషనల్ లిట్రసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ఎగ్జామ్ తో పాటు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (ఎల్ఐపీ) కింద టెస్టులు జరగనున్నాయి. ఈ మేరకు బుధవారం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లు, సొసైటీ గురుకులాలు, కేజీబీవీలు, యూఆర్ఎస్ లల్లో ఫిజికల్ మోడ్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థుల ప్రోగ్రెస్ను విశ్లేషించి వివరాలను ఈ నెల 30వ తేదీ లోపు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ లో అప్లోడ్ చేయాలని డైరెక్టర్ ఆదేశించారు. ప్రతి విద్యార్థికి సంబంధించి గతంలో నిర్వహించిన బేస్లైన్, మిడ్లైన్ పరీక్షల ఫలితాలతో ఇప్పుడు వచ్చే ఎండ్లైన్ మార్కులను పోల్చి చూడాలని హెడ్ మాస్టర్లకు సూచించారు. రిజల్ట్ ఎంట్రీలో డీఈవోలు శ్రద్ధ తీసుకోవాలని డైరెక్టర్ సూచించారు.
