- క్యూర్ పరిధిలోని డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారుల దాడులు
- టన్ను పామాయిల్, 476 కిలోల కెమికల్ స్వాధీనం
- నార్ముల్, గీతా డెయిరీలకు షోకాజ్ నోటీసులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)తో పాటు పరిసర జిల్లాల్లోని కల్తీ పన్నీరు తయారు చేస్తున్న డెయిరీ యూనిట్లపై అధికారులు దాడులు చేశారు. మొత్తం 14 డెయిరీ యూనిట్లపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్(టీజీ సేఫ్) ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్-ఫాస్ట్ సిబ్బంది కలిసి 12 టీమ్లుగా ఏర్పడి శనివారం ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
రూల్స్ బ్రేక్ చేస్తున్న పలువురు వ్యాపారులపై చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో విక్రయిస్తున్న పనీర్ చాలా వరకు స్వచ్ఛమైనది కాదని, లూజ్ పామాయిల్, ప్రమాదకర కెమికల్స్ కలిసిన ముద్ద అని అధికారుల తనిఖీల్లో బయటపడింది. జీడిమెట్ల, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, హయత్నగర్, బహదూర్పురా, హుస్సేనీ ఆలం, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని డెయిరీలను అధికారులు తనిఖీ చేశారు.
పలు యూనిట్లలో పనీర్ తయారీకి లూజ్ పామాయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్ కెమికల్ వాడుతున్నట్లు గుర్తించారు. చాలా చోట్ల బొద్దింకలు, ఈగలు ముసురుతున్న అపరిశుభ్ర వాతావరణంలో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అసలు ఈ యూనిట్లకు పాలు ఎక్కడి నుంచి కొంటున్నారనే రికార్డులు కూడా లేవని అధికారులు తెలిపారు. కల్తీ అనుమానంతో వివిధ యూనిట్ల నుంచి 21 ఫుడ్ శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం ల్యాబ్కు పంపించారు.
రూ.7.19 లక్షల విలువైన సరుకు సీజ్..
ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించిన తయారీ యూనిట్ల నుంచి మొత్తం రూ.7.19 లక్షల విలువైన సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు టన్ను లూజ్ పామాయిల్ను సీజ్ చేశారు. పనీర్ తయారీలో అనధికారికంగా వాడుతున్న 476 కిలోల గ్లిజరాల్ మోనోస్టియరేట్ కెమికల్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలతో విక్రయిస్తున్న 1,760 క్రీమ్ ప్యాకెట్లను, 150 కిలోల మిల్క్ పౌడర్ను అధికారులు సీజ్ చేశారు.
మూడు డెయిరీల లైసెన్సులు సస్పెండ్..
ఉల్లంఘనలకు పాల్పడిన మూడు డైయిరీ యూనిట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గగన్ పహాడ్లోని లక్ష్మి ఫుడ్స్ యూనిట్లో బొద్దింకలు, 600 లీటర్ల లూజ్ పామాయిల్, కెమికల్స్ గుర్తించారు. మైలార్దేవ్ పల్లిలోని ధనలక్ష్మి డెయిరీ ప్రొడక్ట్స్లో మురుగు డ్రైనేజీ సమస్యలు, దుర్వాసన, ఈగలు, 195 లీటర్ల లూజ్ పామాయిల్ ఉండడంతో లైసెన్స్ సస్పెండ్ చేశారు.
అల్వాల్ పరిధిలోని నటరాజ్ మిల్క్ అండ్ మిల్క్ ఫుడ్ ప్రొడక్ట్స్ యూనిట్లో బూజు పట్టిన గోడలు, మురికి పైకప్పులు, కెమికల్స్ వాడుతున్నందున మూసివేయించారు. అలాగే, అపరిశుభ్రంగా వాతావరణంలో ఉండటంతో నాదర్గుల్లోని గీతా డెయిరీతో పాటు హయత్ నగర్లోని నార్ముల్ డెయిరీ యూనిట్కు టీజీ సేఫ్ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అంతేకాకుండా ఖానాపూర్లోని శ్రీ మహాలక్ష్మి కేంద్ర, హయత్నగర్లోని అనిత డెయిరీలకు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసులు అందించారు. రానున్న రోజుల్లో ఈ యూనిట్లను మళ్లీ తనిఖీ చేస్తామని, నిబంధనలు పాటించకపోతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని టీజీ సేఫ్ కమిషనర్ హెచ్చరించారు.
