గండిపేట, వెలుగు: నూతనంగా నియమితులైన 53 మంది సైంటిఫిక్ అధికారులకు ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన రెండు వారాల రెసిడెన్షియల్ ఫౌండేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ శనివారం విజయవంతంగా ముగిసింది. గత నెల 18 నుంచి ఈ నెల 5 వరకు ఈ శిక్షణ కొనసాగింది. ముగింపు కార్యక్రమంలో టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్ హాజరై నూతన అధికారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేర దర్యాప్తులో ఫోరెన్సిక్ సైన్స్ కీలకమైన భాగమన్నారు. ఫోరెన్సిక్ రంగంలో నిబద్ధత, కచ్చితత్వం, నిష్పాక్షికత, వృత్తిపరమైన నైతికతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. టీచర్స్డేను పురస్కరించుకొని ట్రైనీ అధికారులు అకాడమీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లను సన్మానించి గురు పూజోత్సవం నిర్వహించారు. అనంతరం అధికారులకు డైరెక్టర్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
