వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీలో శనివారం మెడికోలు సర్టిఫికెట్ల కోసం తిప్పలు పడ్డారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పాసైన మెడికోలు స్లాట్ బుక్ చేసుకోగా, శనివారం అపాయింట్మెంట్ వచ్చింది. దీంతో పూణే, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాల నుంచి 200 మంది మెడికోలు పేరెంట్స్తో కలిసి ఉదయం యూనివర్సిటీకి చేరుకున్నారు.
అయితే సర్టిఫికెట్లపై సంతకాలు కాలేదని చెబుతూ మెడికోలను ఆఫీస్ చుట్టూ తిప్పించుకున్నారు. సిబ్బంది కొరత ఉందని, నలుగురు స్టాఫ్తోనే పనులు చూసుకోవాల్సి వస్తోందని అధికారులు చేతులెత్తేశారు. కొంత ఆలస్యంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఇంత పెద్ద యూనివర్సిటీలో ఇలాంటి నిర్లక్ష్యం సరికాదని పేరెంట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
