నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాలుడు కిడ్నాప్..చాక్లెట్ ఇస్తానంటూ పిల్లోడిని ఎత్తుకెళ్లిన మహిళ

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాలుడు కిడ్నాప్..చాక్లెట్ ఇస్తానంటూ  పిల్లోడిని ఎత్తుకెళ్లిన మహిళ

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జీజీహెచ్​లో శనివారం రెండున్నరేండ్ల బాలుడు కిడ్నాప్​కు గురయ్యాడు. తల్లిని చూడడానికి హాస్పిటల్​కు వచ్చిన బాలుడికి చాక్లెట్​ ఆశ చూపించి గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

బాల్కొండ మండలం నాగపూర్​ గ్రామానికి చెందిన కొసడి నరేశ్, సంధ్య దంపతులకు నివాన్ష్(5), దేవాన్ష్(రెండున్నరేండ్లు) ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యను మూడో కాన్పు కోసం బుధవారం జీజీహెచ్​లోని మాతాశిశు సెంటర్​లో చేర్పించగా, ఆడపిల్ల పుట్టింది. శనివారం నరేశ్​ తన ఇద్దరు కొడుకులతో కలిసి హాస్పిటల్​కు వచ్చాడు. 

అంతా కలిసి మధ్యాహ్నం భోజనం చేశాక చేతులు కడుక్కోడానికి ట్యాప్​ దగ్గరకు వచ్చినప్పుడు గుర్తు తెలియని 40 ఏండ్ల మహిళ వారితో మాటలు కలిపింది. చాక్లెట్​ ఇస్తానని చెప్పడంతో ఇద్దరు పిల్లలు అమాయకంగా ఆమె వెంట హాస్పిటల్​ వరండా దాకా వెళ్లారు. 

అక్కడి నుంచి దేవాన్ష్​ను మహిళ ఆటోలో ఎత్తుకెళ్లింది. పెద్ద కొడుడు నివాన్ష్​ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి, నానమ్మకు ఈ విషయం చెప్పాడు. తండ్రి హాస్పిటల్,​ బస్టాండ్​ పరిసరాల్లో వెతికినా కనిపించకపోవడంతో వన్​టౌన్​ పోలీస్​లకు ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీ ఆధారంగా నాలుగు పోలీస్​ టీంలు బాలుడి కోసం వెతుకుతున్నాయి.