- యూపీలోని బులంద్ షహర్లో నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ: హిందూత్వ ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్ను శనివారం ఢిల్లీ కోర్టు ఒకరోజు పోలీసు కస్టడీకి అప్పగించింది. అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లేలర్ నివాసంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. భరద్వాజ్ తరఫున లీగల్ కౌన్సెల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి నిందితుడిని పాటియాలా హౌస్ కోర్టులో భౌతికంగా హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ విధంగా విచారణ జరిపారు.
వివాదం ఏంటంటే..?
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళన సందర్భంగా ఓ మైనర్ కార్యకర్త తండ్రిపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది తానేనని స్వతంత్ర భరద్వాజ్ ఇటీవల ఓ వీడియో పాడ్కాస్ట్లో వెల్లడించాడు. ఆందోళనకారుడి తండ్రి తల పగులగొట్టినా తనకున్న రాజకీయ పరిచయాలతో అరెస్ట్ నుంచి తప్పించుకున్నానని గొప్పలు చెప్పుకున్నాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు యూపీలోని బులంద్ షహర్లో శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నాకు సంబంధం లేదు: చిరాగ్ పాశ్వాన్
స్వతంత్ర భరద్వాజ్పై కేంద్రమంత్రి, లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు తన పేరును, ఇతర నేతల పేర్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సీజేపీ కార్యకర్తపై దాడితో తనకు, తన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
