శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ యాసిర్ హతమయ్యాడు. బుద్గామ్ జిల్లాలోని యూస్మార్గ్ ఎత్తైన ప్రాంతాల్లో శనివారం భద్రతా దళాల ఉమ్మడి బృందంతో జరిగిన ఎన్కౌంటర్లో యాసిర్ హతమయ్యాడని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు.. స్పెషల్ ఫోర్సెస్, 53 రాష్ట్రీయ రైఫిల్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.
లష్కరే తొయిబాకు చెందిన సులేమాన్ మూసా టీంలో యాసిర్ సభ్యుడిగా ఉండేవాడు. దాదాపు ఏడాది క్రితం అతను ఆ టీం నుంచి విడిపోయి స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. అతడి కదలికలను గమనిస్తున్న భద్రతా సంస్థలు యూస్మార్గ్ ప్రాంతంలో కొంతకాలంగా నిఘా ఉంచాయి. సులేమాన్ మూసా టీం నుంచి విడిపోయిన తర్వాత యాసిర్ ఆ ప్రాంతంలో కీలకమైన లష్కరే కార్యకర్తగా ఎదిగాడు.
అతడి నెట్వర్క్, ఇతర లష్కరే తొయిబా కార్యకర్తలతో ఉన్న సంబంధాలు, ఈ ప్రాంతంలో అతని కార్యకలాపాల స్థాయిపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. జమ్మూకాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ప్లానింగ్ లో యాసిర్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నాయి.
