- శిక్షలపై నిర్ణయం ఈ నెల 16కు వాయిదా
భద్రాచలం, వెలుగు: 2013 మే 25న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జీరంఘాటీలో మావోయిస్టుల హత్యాకాండలో జగదల్పూర్ లోని ఎన్ఐఏ కోర్టు శనివారం 10 మందిని దోషులుగా నిర్ధారించింది. 13 ఏళ్ల తర్వాత నిర్ధారణకు వచ్చిన కోర్టు శిక్షలపై నిర్ణయాన్ని ఈనెల 16కు వాయిదా వేసింది.
పరివర్తన యాత్ర కాన్వాయ్లో వెళ్తున్న సల్వాజుడుం వ్యవస్థాపక అధ్యక్షుడు మహేంద్రఖర్మ, ఛత్తీస్గఢ్ పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, మాజీ కేంద్ర మంత్రి వీసీ శుక్లా సహా 29 మంది కాంగ్రెస్ నేతలు మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో చనిపోయారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కోర్టు 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని సేకరించింది. గత ఆగస్టు నెలలోనే విచారణ పూర్తి చేసింది. 11 మందిని దోషులుగా తేల్చగా, అందులో ఒకరు విచారణ సమయంలో చనిపోయారు. ప్రమీలా కోడియం అలియాస్ జ్యోతి, బంజా అలియాస్ సన్నా, ఆయతే మరకాం, ముక్కా మండావి, మడకం దేవా, కవ్వాసి కోసా, చైతూ అలియాస్ మున్నా, కోస, మహాదేవ్ నాగ్, సుమిత్రాను దోషులుగా గుర్తించారు.
కాగా దీనిపై సల్వాజుడుం వ్యవస్థాపక అధ్యక్షుడు మహేంద్రఖర్మ కుమార్తె తూలికా ఖర్మా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి తొలి ఫిర్యాదు చేసిన తనను విచారించలేదన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బదేల్ కూడా ఇదే తరహాలో స్పందించారు. మావోయిస్టు అగ్రనేతలను తప్పించారని ఆయన ఆరోపించారు. ఈనెల 16న శిక్షలపై తీర్పు వచ్చాక పరిశీలించి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు నిందితుల తరుపు న్యాయవాది తెలిపారు.
