- క్షేత్రస్థాయి విచారణకు ‘చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్’
- సెప్టెంబర్ 25 లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం
- కలెక్టర్ల ఆమోదం తర్వాతే మంజూరు ఉత్తర్వులు
- అనర్హులను చేరిస్తే రికవరీతో పాటు కఠిన చర్యలు: సెర్ప్ సీఈవో
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ‘చేయూత’ కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ మొదలైంది. తొలి విడతలో దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ(సెర్ప్) శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఓవైపు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నప్పటికీ సమాంతరంగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మరోవైపు సెప్టెంబర్ 25 నాటికి వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హుల తుది జాబితాను సిద్ధం చేయాలని సెర్ప్ సీఈవో కూడా స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రత్యేక పరిశీలన అధికారులను(డీవీఓ)లను నియమించాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.
నమోదు ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు (ఎంపీవో), సూపరింటెండెంట్ హోదా కలిగిన అధికారులు క్షేత్రస్థాయికి వెళ్తారు. వీరికి ఎంపీడీవోలు లాగిన్ ఐడీలు కేటాయిస్తారు. మున్సిపాలిటీల్లో మున్సిపల్ అధికారులు, సూపరింటెండెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు , ప్లానింగ్ ఆఫీసర్లు, సీనియర్ అసిస్టెంట్ కేడర్ అధికారులను మున్సిపల్ కమిషనర్లు నియమిస్తారు. కార్పొరేషన్ల పరిధిలో సర్కిల్ స్థాయి అధికారులు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు బాధ్యతలు చేపడతారు. డిప్యూటీ కమిషనర్లు లాగిన్ ఐడీలు ఇస్తారు.
‘చేయూత’ మొబైల్ యాప్తో వెరిఫికేషన్
క్షేత్రస్థాయి పరిశీలనను పారదర్శకంగా నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా ‘చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్’ రూపొందించింది. అధికారులకు తమ లాగిన్లో ఆవాసాల(హాబిటేషన్) వారీగా దరఖాస్తుదారుల డేటా కనిపిస్తుంది. అధికారులు దరఖాస్తుదారుల ఇంటికి స్వయంగా వెళ్లి వారి జీవన స్థితిగతులు, సామాజిక, ఆర్థిక పరిస్థితి, నివాసం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అంశాలను పరిశీలిస్తారు. దరఖాస్తు సమయంలో ఏవైనా సర్టిఫికెట్లు లేదా డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోతే, వెరిఫికేషన్ అధికారి లబ్ధిదారుడి నుంచి వాటిని సేకరించి స్పాట్లోనే మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పత్రాలు పూర్తిగా అందుబాటులో లేకపోతే ఆ దరఖాస్తును తాత్కాలికంగా ‘హోల్డ్’లో ఉంచుతారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అధికారి మొబైల్ యాప్లో స్పష్టంగా అర్హులు లేదా అనర్హులు అని నమోదు చేయాలి. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే, అందుకు గల స్పష్టమైన కారణాన్ని యాప్లో తప్పనిసరిగా రికార్డు చేయాలని నిబంధన విధించారు.
అనర్హులను చేరిస్తే రికవరీ, సస్పెన్షన్!
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ ఆడిట్ లేదా ఆకస్మిక తనిఖీల్లో తప్పుడు ధ్రువీకరణలు చేసినట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా అక్రమంగా చెల్లించిన పెన్షన్ మొత్తాన్ని బాధ్యులైన అధికారుల నుంచే రికవరీ చేస్తామని సర్క్యులర్లో హెచ్చరించారు.
కలెక్టర్లదే తుది ఆమోదం.. 25 వరకు గడువు
ఈ నెల 25 నాటికి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు లబ్ధిదారుల జాబితాలను ఆయా జిల్లాల డీఆర్డీవో, హైదరాబాద్లో డీఆర్వోలకు పంపాలి. డీఆర్డీవోలు ఈ జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదానికి సమర్పిస్తారు. కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాతే కొత్త పెన్షన్ల ప్రొసీడింగ్స్ అధికారికంగా సిద్ధం చేసి లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సెర్ప్ ఆదేశించింది.
