రిటైర్డ్ IPS వినయ్ రంజన్ భార్యను.. ఇంట్లోనే హత్య చేసిన నేపాలి పని మనిషి

రిటైర్డ్ IPS వినయ్ రంజన్ భార్యను.. ఇంట్లోనే హత్య చేసిన నేపాలి పని మనిషి

హైదరాబాద్ సిటీలో కలకలం. అత్యంత ధనవంతులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు నివాసం ఉండే జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో దారుణం జరిగింది.  ప్రశాసన్ నగర్ లో నివాసం ఉంటున్న మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య 55 ఏళ్ల సునందను.. ఇంట్లోనే హత్య చేసింది నేపాల్ దేశానికి చెందిన పని మనిషి కల్పన. మే 8వ తేదీ ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  

ప్రశాసన్ నగర్ లోని ఐఏఎస్ క్వార్టర్స్ లో ఉంటున్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్. వాళ్ల ఇంట్లో పని చేయటానికి నేపాల్ దేశానికి చెందిన కల్పన అనే మహిళను పని మనిషిగా పెట్టుకున్నారు. కొన్నాళ్లుగా ఎంతో నమ్మకంగా పని చేసిన కల్పన.. అదును చూసి ఈ ఘోరానికి పాల్పడింది. ఈ హత్యలో పని మనిషి కల్పనతోపాటు ఇంకెవరైనా ఉన్నారా.. నేపాల్ గ్యాంగ్ ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.  నిందితురాలు కల్పన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. 

సంపన్నులు.. ఉన్నతాధికారులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో.. ఓ రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి ఇంట్లో ఈ ఘోరం జరగటం సంచలనంగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పాట్ కు వచ్చారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకోవటానికి పోలీసులు గాలిస్తున్నారని స్పష్టం చేశారు.