విలీనం కాదు కదా.. కనీసం పొత్తు కూడా ఉండదు: బీజేపీ, BRS విలీనంపై జగదీష్ రెడ్డి క్లారిటీ

విలీనం కాదు కదా.. కనీసం పొత్తు కూడా ఉండదు: బీజేపీ, BRS విలీనంపై జగదీష్ రెడ్డి క్లారిటీ

సూర్యాపేట: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలని చూస్తున్నారంటూ గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ విలీనం వార్తలపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం (మే 30)  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాదు కదా.. కనీసం ఆ పార్టీతో పొత్తు కూడా ఉండదని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్‎లో అధినాయకుడు కేసీఆర్ మాత్రమేనని తేల్చి చెప్పారు. 

ఇక.. తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహించిన మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకో అర్ధం కాలేదని అన్నారు. 2004తోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిందని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి తన వల్లే  జరిగిందని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
2004లో సమైఖ్య ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.26 వేల లోపు ఉంటే.. 2014 నుంచి ఆంధ్రలో ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి చంద్రబాబు గుర్తుచేసుకోవాలని చురకలంటించారు. 

►ALSO READ | బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనేదే నా తపన.. బీజేపీలో విలీనం చేయొద్దు : కవిత

కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‎గా నిలిచిందని కొనియాడారు. ప్రత్యేక రాష్టంగా ఏర్పడ్డ నాడు తెలంగాణాలో రూ.1.12 లక్షల తలసరి ఆదాయముంటే.. కేసీఆర్ పాలనలో రూ.3.70 లక్షలకు చేరుకుందని గుర్తు చేశారు. అదే సమయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.2.50 లక్షలు మాత్రమేనని.. చంద్రబాబు పరిపాలన గొప్పదే అయితే ఏపీ ఆదాయం ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు.