బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేసే దమ్ముందా?

బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేసే దమ్ముందా?

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని మోత్కుపల్లి మెచ్చుకున్నారు. ఆలేరు నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. వాసాలమర్రి గ్రామ దళితుల పక్షాన కేసీఆర్‌‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

‘దళితుల విషయంలో దేశంలో అతి పెద్ద నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని పార్టీలు దళితులను దళితులుగానే చూశాయి తప్ప.. నేరుగా వారి ఖాతాల్లో పది లక్షల రూపాయలు వేయడం ఎక్కడా చూడలేదు. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు ఇస్తారనడానికి వాసాలమర్రె నిదర్శనం. బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము అధికారంలో ఉన్న రాష్టాల్లో దళిత బంధును అమలు చేసే ధైర్యం ఉందా? దళిత బంధు దేశం మొత్తం అమలు చేసే విధంగా జాతీయ పార్టీలు వారి అధిష్ఠానాలను ఒప్పించాలి. హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితమని దళిత బంధుపై అవాకులు చెవాకులు మాట్లాడిన వారు ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి. దళితులను బాగు చేయాలనే ఉద్దేశం కేసీఆర్‌‌కు తప్ప.. ఏ రాజకీయ పార్టీకి లేదు. దళితులకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తే రాబోయే రోజుల్లో అంబేడ్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు’ అని మోత్కుపల్లి పేర్కొన్నారు.