
జమిలి ఎన్నికలు ఏ ఒక్క పార్టీకి ఉపయోగడపడేవి కాదని, అందరికీ ఉపయోగపడేవని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని రామ్నాథ్ చెప్పారు. దేశానికి మేలు చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకే దేశం -ఒకే ఎన్నికకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రామ్ నాథ్ కోవింద్ మీడియాతో మాట్లాడారు. ఒకే దేశం-ఒకే ఎన్నికకు కోవింద్ మద్దతు తెలిపారు. ఏ పార్టీకైనా వీటితో ప్రయోజనమేనని అన్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి రామ్నాథ్ కోవింద్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఒకే దేశం-ఒకే ఎన్నికపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి, దానికి తనను ఛైర్మన్గా నియమించిందని చెప్పారు. ఈ కమిటీ జమిలి ఎన్నికలు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి... వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నామన్నారు. ఏదో ఒక సమయంలో అన్ని పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయన్నారు. ఇది దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని, దేశ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఒకే దేశం-ఒకే ఎన్నికకు మద్దతు తెలపాలని కోరారు. జమిలి ఎన్నికల వల్ల ఆదా అయ్యే డబ్బును అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయవచ్చని చెప్పారు. దానివల్ల అంతిమంగా ప్రజలకే మేలు జరుగుతుందన్నారు.
ఒకే దేశం-ఒకే ఎన్నికపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఛైర్మన్గా వ్యవహరిస్తుండగా.. కేంద్ర హోం మంత్రి అమిత్షా, లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉన్నారు.