
- నేను ఆదేశాలిచ్చినట్టు ఆధారాలుంటే చూపండి
- ట్యాపింగ్ రివ్యూ కమిటీలో నేను సభ్యడినే కాదు
- అదే రోజు హార్డ్ డిస్కులు ధ్వంసమైతే నాకేం సంబంధం
- సిట్ విచారణలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ తో తనకేం సంబంధం లేదన్నారు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఇవాళ విచారణకు హాజరైన ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. కోర్టులో వినిపించిన వదదలనే మరోసారి సిట్ ముందు చెబుతున్నారాయన. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా ఎదురు ప్రశ్నలు వేస్తుండటం గమనార్హం. ఫోన్ లు ట్యాప్ చేయాలని అధికారులకు నేను ఎక్కడ ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. తాను ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని అధికారులతో అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ కమిటీ ఉంటుందని, ఆ కమిటీలో తాను సభ్యుడిని కాదని తెలిపారు. తాను డిసెంబర్ 4 వ తేదీ 2023 సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేశానని అన్నారు. అదే రోజు రాత్రి 8 గంటలకు హార్డ్ డిస్కులు ధ్వంసమయ్యాయని, ఆ పరిణామంతో తనకేం సంబంధం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీ సభ్యులను ఈ కేసులో ఎందుకు ఇన్ వాల్వ్ చేయలేదో చెప్పాలన్నారు.