హైదరాబాద్ లో నలుగురు చైన్ స్నాచర్లు అరెస్ట్

హైదరాబాద్ లో  నలుగురు  చైన్ స్నాచర్లు అరెస్ట్

ఇబ్రహీంపట్నం, వెలుగు:  చైన్ స్నాచింగ్​లతో పాటు వెహికల్స్ చోరీ చేస్తున్న నలుగురిని ఎల్ బీనగర్ సీసీఎస్, మాడ్గుల పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని ఏసీపీ ఆఫీసులో రాచకొండ డీసీపీ అరవింద బాబు కేసు వివరాలు వెల్లడించారు.  నల్గొండ జిల్లా మునావత్ తండాకు చెందిన ఆటోడ్రైవర్  రమేశ్, నరేశ్, దేవరకొండ మండలం జల్ తండాకు చెందిన దాసు నాయక్, నేరెడెగూడెం మండలానికి చెందిన రవి.. ఈ నలుగురు గ్యాంగ్​గా ఏర్పడి చైన్ స్నాచింగ్ లు, వెహికల్స్ చోరీలకు పాల్పడుతున్నారు.  

ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసి గోల్డ్ చైన్లను ఎత్తుకెళ్లేవారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని న్యూ బ్రాహ్మణ పల్లి వద్ద ఆటోలో వస్తున్న ఈ నలుగురిని ఎల్ బీనగర్ సీసీఎస్, మాడ్గుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 98 గ్రాముల బంగారం, ఆటో, 2 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురిపై మాడ్గుల, చింతపల్లి, కనగల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు.