దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనేది పాత సామెత.. ప్రస్తుతం దేశంలో మానవత్వం అనేది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనటానికి ఈ ఘటనే నిదర్శనం. ఎంత కోపం ఉంటే.. ఎంత వ్యతిరేకత ఉంది.. ఎంత ద్వేషం ఉంటే ఇలా చేస్తారు అంటూ దేశం మొత్తం నోరెళ్లబెడుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిన్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో జుర్ధా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళలకు 12 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. ఎనిమిదేళ్లు వీళ్ల సంసారం సాఫీగానే సాగింది. నాలుగేళ్ల క్రితం భర్తను వదిలేసిన మహిళ.. గ్రామంలోని మరో యువకుడితో సహ జీవనం ప్రారంభించింది. ఏడాది తర్వాత సహజీవనం చేస్తున్న యువకుడిపై అత్యాచారం కేసు పెట్టింది ఆ మహిళ. పోలీసులు, కోర్టు విచారణ తర్వాత జైలు శిక్ష పడింది ఆ యువకుడికి.
ఇటీవలే జైలు నుంచి ఆ యువకుడు విడుదల అయ్యాడు. అత్యాచారం చేసినట్లు కేసు పెట్టిన మహిళ.. మళ్లీ ఆ యువకుడితో సహ జీవనం ప్రారంభించింది. ఈ విషయం తెలిసిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు అవమానాన్ని భరించలేకపోయారు. జైలుకు పంపించిన యువతినే.. మళ్లీ మా అబ్బాయితో సహజీవనం చేయటం ఏంటంటూ గొడవ పడ్డారు. ఆవేశంతో కొట్టారు.
ఇలా చేసినా ఆ యువతికి బుద్ధి రాదు అనుకున్నారో ఏమో.. గ్రామంలోని నడి వీధిలోనే దుస్తులు అన్నీ బలవంతంగా విప్పేశారు.. ముఖానికి నల్ల రంగు పూశారు.. మెడలో చెప్పుల దండ వేశారు.. నగ్నంగా ఊరులో ఊరేగించారు. ఆ యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఈ విషయం పోలీసులకు తెలియటంతో కేసు నమోదు చేశారు. 11 మందిని నిందితులుగా తేల్చారు. వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మహిళ దుస్తులు తొలగించటం, బల ప్రయోగం, బెదిరింపులు, అవమానించటం వంటి సెక్షన్ల కింద అరెస్టులు చేశారు మిగతా నిందితులు పరారీలో ఉన్నారని.. వాళ్లను కూడా పట్టుకుంటామని వెల్లడించారు ఉజ్జయిని రూరల్ ఎస్పీ కరణ్ దీప్ సింగ్. మిగతా నిందితులను పట్టుకునేందుకు స్టేషన్ ఇంచార్జి ఆనంద్ భాబోర్ ఆధ్వర్యంలో టీం గాలిస్తుందని వెల్లడించారు రూరల్ ఎస్పీ.
ఇలాంటి ఘటనలు దారుణం అని.. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందంటున్నారు గ్రామస్తులు.
