సినిమా స్టైల్లో నలుగురు దొంగలు బ్యాంకు దోపిడీ చేశారు. హెల్మెట్లు పెట్టుకుని వచ్చి.. తుపాకీలతో బెదిరించి, దాదాపు 30 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. యూపీలోని బస్తీ జిల్లాలోని ఈ ఘటన జరిగింది.
బస్తీ ఐసీఐసీఐ బ్రాంచ్లోకి శుక్రవారం ఉన్నట్టుండి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. లోపలికి రాగానే తలుపులు వేసి, తుపాకీలు చూపించి బెదరగొట్టి బ్యాంకు క్యాషియర్ దగ్గర ఉన్న డబ్బు లాక్కున్నారు. అలాగే అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడానికి వచ్చిన కస్టమర్ల నుంచి దగ్గర ఉన్న సొమ్ము కూడా దోచుకున్నారు.
తుపాకీతో బెదిరించి తన దగ్గర 6.5 లక్షల రూపాయలు దోపిడీ చేశారని ఓ కస్టమర్ చెప్పాడు. నలుగురు దుండగులు బైక్లపై వచ్చి ఈ దోపిడీకి పాల్పడ్డారని బస్తీ ఎస్పీ హేమరాజ్ మీనా తెలిపారు. వారు సుమారు 25 నుంచి 30 లక్షల రూపాయలు దోచుకెళ్లినట్లు చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, వారికి త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.