మొన్న గచ్చిబౌలిలో, ఇప్పుడు తిరుపతిలో.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం... కొత్త బిల్డింగ్ కోసం గుంతలు తవ్వుతుండగా...

మొన్న గచ్చిబౌలిలో, ఇప్పుడు తిరుపతిలో.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం... కొత్త బిల్డింగ్ కోసం గుంతలు తవ్వుతుండగా...

హైదరాబాద్ లోని గచ్చిబౌలి అంజయ్య నగర్ లో బిల్డింగ్ కూలిపోయిన ఘటనమరువక ముందే తిరుపతిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. కొత్త బిల్డింగ్ కోసం పక్కన గుంతలు తవ్వుతుండగా ఘటన చోటు చేసుకుంది. బుధవారం ( ఆగస్టు 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

తిరుపతిలోని RC రోడ్డులో ఉన్న కలశం బిల్డింగ్ దగ్గర ఉన్న గ్యాస్ గోడౌన్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ కుప్పకూలింది. కొత్త బిల్డింగ్ కోసం గుంతలు తవ్వుతున్న సమయంలో ఈ బిల్డింగ్ కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కళ్ళ ముందే నాలుగు అంతస్తుల భవనం కూలిపోవడంతో షాక్ అయ్యారు అందరు.

ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే.. ఆస్తి నష్టం తప్ప ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బిల్డింగ్ కూలడానికి కారణం కొత్త బిల్డర్ నిర్లక్ష్యమా లేక కూలిన బిల్డింగ్ లో నిర్మాణ లోపమా అన్నది తెలియాల్సి ఉంది.