
- గద్వాల జిల్లాలో యువకుడి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలో పెండ్లి అయిన నెలకే భర్తను హత్య చేయించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తేజేశ్వర్ అనే యువకుడిని అతడి భార్య ఐశ్వర్య హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీస్ ఎంక్వైరీలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి.
పెండ్లి తర్వాత నెలలోనే నాలుగు సార్లు తేజేశ్వర్ను హత్య చేయించేందుకు ఐశ్వర్య ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడి బైక్కు జీపీఎస్ సిస్టమ్ను అమర్చినట్లు తెలిసింది. నాలుగు సార్లు విఫలమైన తర్వాత ఐదోసారి కర్నూల్కు చెందిన సుపారి గ్యాంగ్తో తేజేశ్వర్ను హత్య చేయించినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు.
గద్వాల సీఐ శీను, రూరల్, గట్టు ఎస్సైలు శ్రీకాంత్, కేటీ మల్లేశ్లు నిందితులను వెంటబెట్టుకొని.. ఈ నెల 17న తేజేశ్వర్ను కారు ఎక్కించుకొని ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడ కిడ్నాప్ చేశారు ? ఎక్కడ హత్య చేశారు ? బాడీని ఎక్కడ పడేశారు ? అనే వివరాలను సేకరించారు.