Free medical camp : మహిళా జర్నలిస్ట్‌లకు ఉచిత వైద్య శిబిరం

Free medical camp : మహిళా జర్నలిస్ట్‌లకు ఉచిత వైద్య శిబిరం

హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లోని ఐ అండ్ పీఆర్ ఆఫీస్ లో మహిళా జర్నలిస్ట్ లకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును సీఎస్ శాంతి కుమారి ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో శ్వేత మహంతి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ శిబిరం మార్చి 28 నుంచి ఏప్రిల్ 9  వరకు జరగనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు.

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు మహిళా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఇంట్లో అందరి గురించి పట్టించుకునే మహిళలు వారి ఆరోగ్యంపై మరీ తీవ్రంగా ఉంటే తప్ప శ్రద్ధ పెట్టరన్నారు. మహిళలు 35 ఏళ్ల తర్వాత కచ్చితంగా జనరల్ హెల్త్ చెక్ అప్ లు చేయించుకోవాలని సీఎస్ సూచించారు. జర్నలిస్ట్ లు సవాళ్ళతో కూడిన  ఉద్యోగాలు చేస్తారన్న ఆమె... వారికోసమే ఈ క్యాంప్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. చెక్ అప్ చేసిన రోజే రిపోర్ట్స్ అందచేస్తారని తెలిపారు.

ఈ వైద్య శిభిరంలో రాష్ట్ర స్థాయి అక్రిడేటెడ్ మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి అక్రిడిటేషన్ పొందిన మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీఎస్ శాంతి కుమారి చెప్పారు. జిల్లాలకు చెందిన అక్రిడేటెడ్ మహిళా జర్నలిస్టులకు ఆయా జిల్లా కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం హెల్త్ ఇనిషియేటివ్ తీసుకొని దేశంలో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్ కిట్ వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీస్ పెరగడంతో పాటు సిజేరియన్స్ తగ్గాయని తెలిపారు. మోర్టాలిటీ, ఫెర్టాలిటీ రేట్ తగ్గిందన్న ఆమె.. ఈ విషయంలో దేశంలో మూడో స్థానంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. కంటి వెలుగు వరల్డ్ లార్జెస్ట్ ఐస్ స్క్రీనింగ్ ప్రోగ్రామని, ఫస్ట్ ఫేజ్ లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేశామన్న ఆమె... 45లక్షల మందికి కళ్ళ జోడ్లు అందించామని స్పష్టం చేశారు. సెకండ్ ఫేజ్ లో 1.80 లక్షలు మందికి పైగా కంటి పరీక్షలు చేసి 70 లక్షల మందికి పైగా కళ్ళ జోడ్లు ఇచ్చామన్నారు. ఈ మెడికల్ క్యాంపును మహిళందరూ ఉపయోగించుకొని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు.

అక్రిడేటెడ్ మహిళా జర్నలిస్టులకు మార్చి 28 నుంచి పది రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య కమిషనర్ శ్వేత మహంతి చెప్పారు. ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ లో రక్త పరీక్ష (C.B.P) , బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బి12, డి3 మొదలైన డయాగ్నోస్టిక్స్ పరీక్షలు , ఈసీజీ (ECG), ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మియర్, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, కంటి స్క్రీనింగ్ , దంత పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైన పరీక్షలు చేయనున్నారని స్పష్టం చేశారు. మహిళా జరలిస్ట్ లు వారి బిజీ షెడ్యూల్ వల్ల హెల్త్ మీద ఫోకస్ పెట్టడం లేదని, దీని వల్ల థైరాయిడ్, విటమిన్ డి,బి12, డెఫిషియన్సీ బారిన పడుతున్నారని తెలిపారు. మహిళా జర్నలిస్ట్ లందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.